మెహిదీపట్నం:యూ ట్యూబ్ ఛానల్లో క్రైం రిపోర్టర్గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ,అందుకు కెమెరాలు తెచ్చుకోవాలని చెప్పి అమాయకుల వద్ద నుంచి కెమెరాలు దొంగిలిస్తున్న ఓ దొంగను పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెప్ట్ చేశారు. అతని నుంచి 11 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమీషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ , పంజాగుట్ట ఏసీపీ గణేష్, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ నాగయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్రాష్ట్రం తిరుపతి ఎస్ఎన్పురం ప్రాంతానికి చెందిన చుంచు ప్రవీణ్కుమార్ అలియాస్ తేజ అలియాస్ కళ్యాణ్ అలియాస్ సాంబశివ అలియాస్ అభిరామ్ అలియాస్ ప్రభు కుమార్(32) నగరంలోని లోతుకుంట ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతడు యూసుఫ్గూడలో ఉన్న ఫోకస్ యాక్టింగ్ అకాడమీలో నటనలో శిక్షణ పొంది పలు సీరియల్స్, సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా, జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. ఈ క్రమంలో తాగుడుకు , జల్సాలకు అలవాటు పడ్డాడు. షూటింగ్ల సమయంలో అక్కడ కెమెరామెన్లు విలువైన కెమెరాల గురించి చర్చించుకోవడం ఇతడు గమనించాడు. తనకు ఆదాయం సరిపోక పోవడంతో కెమెరామెన్ల మాటలు గుర్తుకు వచ్చి కెమెరాలు దొంగిలించాలని పథకం రూపొందించాడు.
కొన్ని రోజులు జై భీమ్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ర్రైం రిపోర్టర్గా కూడా పనిచేశాడు. దీన్ని ఆవకాశంగా చేసుకుని సినిమా అవకాశాల కోసం వచ్చే కెమెరామెన్లను లక్ష్యంగా చేసుకున్నాడు. టీవీ క్రై రిపోర్టర్లుగా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి కెమెరాలతో ఇంటర్వ్యూలకు రావాలని పిలిచేవాడు. అలా వచ్చిన వారిని మాయమాటలతో మభ్య పెట్టి కెమెరాలను దొంగిలించి పారిపోయేవాడు. కెమెరాల దొంగతనాల గురించి ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ నాగయ్య తన బృందంతో విచారణ చేపట్టి సోమవారం చుంచు ప్రవీణ్కుమార్ను నాగార్జున సర్కిల్ సమీపంలో పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా కెమెరా దొంగతనాల గురించి ఒప్పుకున్నాడు. ఇతడి వద్ద నుంచి 11 కెమెరాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.