పహాడీషరీఫ్, జూలై 20: చెడు అలవాట్లకు బానిసైన ఓ యువకుడు మృగంగా మారాడు. ముక్కుపచ్చలారని ఏడేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. బాలుడు సహకరించకపోవడంతో భయంతో హత్య చేశాడు. 2019, మే 8వ తేదీన బాలాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదుగా శిక్షతో పాటు రూ. ఏడు వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపారు.
ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. బాలాపూర్ మండల పరిధిలోని వాదీ ఏ ముస్తఫా కాలనీకి చెందిన ఒమర్ బిన్ హసన్ (25) చెడు అలవాట్లకు బానిసై జులాయిగా తీరిగాడు. పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు అతడి వివాహం చేయలేకపోయారు. గంజాయి మత్తులో ఉండే నిందితుడికి లైంగిక కోరికలు పెరగడంతో ఆ కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఈ క్రమంలోనే 2019, మే 8వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఏడేండ్ల బాలుడు చాక్లెట్ కొనుగోలు కోసం వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న దుకాణానికి వచ్చాడు. ఒమర్ బిన్ హసన్ ఆ బాలుడిని గమనించాడు. బాలుడి వద్దకు వెళ్లి.. మాయమాటలు చెప్పాడు. మాటల్లో పెట్టి ప్రహరీ నిర్మించి ఉన్న స్థలంలోకి తీసుకెళ్లాడు.
అక్కడ బాలుడిపై వికృత చేష్టలతో లైంగిక దాడికి దిగాడు. బాలుడు సహకరించకపోవడంతోపాటు కేకలు వేస్తూ ఏడ్చాడు. విషయం బయటకు తెలుస్తుందన్న భయంతో బాలుడి చేతులు, కాళ్లు పట్టుకొని నిందితుడు బండకు కొట్టాడు. దీంతో బాలుడి తలకు బలంగా దెబ్బ తగలడంతో మరణించాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన బాలాపూర్ అప్పటి ఇన్స్పెక్టర్ సైదులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తించి అరెస్టు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు పడటంలో సాక్షులను ప్రవేశపెట్టిన సీఐ భాస్కర్ను, ప్రభుత్వం తరురఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములును వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అభినందించారు.