వెంగళరావునగర్, సెప్టెంబర్ 19: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ వాహనదారుడు తన బైక్తో ఏకంగా ట్రాఫిక్ పోలీసునే ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ తో సహా వాహనదారుడు పరారయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ మొబైల్ వన్లో కానిస్టేబుళ్లు సురేశ్ కులకర్ణి (57) బాలరాజు, హోంగార్డు సురేశ్కుమార్ అమీర్పేట్ మైత్రీవనం జంక్షన్లో శనివారం రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. సురేశ్ కులకర్ణి సారథి స్టూడియో వైపు నుంచి పెట్రోల్ బంక్ వైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, అమీర్పేట్ నుంచి యూసుఫ్గూడ వైపునకు వెళ్తున్న ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. సురేశ్ తల పగిలి తీవ్రంగా గాయపడగా, ప్రమాదానికి కారణమైన వాహనదారుడు తన బైక్తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. సురేశ్ను అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రేయ తన వాహనంలో అమీర్ పేట్ లోని ఓ వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమిస్తుండటంతో అపోలోకు తీసుకెళ్లారు. 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రేయ తెలిపారు. ద్విచక్ర వాహనదారుడి కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజీ సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.