బంజారాహిల్స్,ఆగస్టు 11: ఫిలింనగర్ 18 బస్తీలకు చెందిన ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బుధవారం ఫిలింనగర్లో రెడ్ఫోర్ట్ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని 100 ఫీట్ల రోడ్డు పక్కన నిర్మించేందుకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రైవేటు సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించవద్దంటూ స్థానికులు కోరగా నిర్మాణ సంస్థతో మాట్లాడి సుమారు 700 గజాల స్థలంలో ఆలయాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించడం జరిగిందని, ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా వారే భరిస్తారని తెలిపారు. ఫిలింనగర్ 18 బస్తీల్లో ఎక్కడా లేని విధంగా మంచి ఆలయ నిర్మాణంతో పాటు స్థానికుల అవసరాల కోసం కల్యాణమండపాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. కాగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఉన్నచోటనే ఉంచాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆలయానికి ఎకరం స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.