సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఉచిత తాగునీటి గృహ వినియోగదారుల ఆధార్ లింక్ను సులభతరం చేసేందుకు జలమండలి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా సెక్షన్ కార్యాలయాల్లో బయో మెట్రిక్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉచిత తాగునీరు పథకం అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జలమండలి ఎండీ దానకిశోర్ మంగళవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ వినియోగదారుల ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయాలన్నారు. జల మండలి శిక్షణ ఇచ్చిన మీటర్ రీడర్లు వినియోగదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాల న్నారు.
వినియోగదారులు తమ క్యాన్ నెంబర్తో మీ సేవ కేంద్రాల్లో ఆధార్ అనుసంధానం చేసుకునే సౌలభ్యం కల్పించామన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు ఆరు నెలల్లో జలమండలి జారీ చేసిన బిల్లు కాపీని తీసుకు వెళ్లాలన్నారు. మీటర్లు లేని వారు.. మీటర్లు పని చేయని వారు కొత్త మీటర్లు బిగించుకోవాలన్నారు. డొమెస్టిక్ కేటగిరిలో మీటర్ లేని వినియోగదారులను గుర్తించి కొత్త మీటర్లు ఏర్పాటు చేసేందుకు మేనేజర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్కుమార్, ఆపరేషన్స్-2 డైరెక్టర్ ఎం.స్వామి, ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్ సీజీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.