ముషీరాబాద్, నవంబర్ 24 : గ్రాంథిక భాషలో సామాజిక రుగ్మతలను ఎండగడుతూ పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన సాక్షి వ్యాసాలు తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరుగుతున్న “ఎందరో మహానుభావుల మధుర స్మృతులలో” కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రముఖ సాహితీవేత్త పానుగంటి లక్ష్మీనరసింహారావు జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వకుళాభరణం ముఖ్య అతిథిగా హాజరై లక్ష్మీనరసింహారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తంగిరాళ్ల చక్రవర్తి, శశిబాల, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు.