రైతు వేదికల్లో ఇక భూసార పరీక్షలు
మే మొదటి వారంలో నమూనా సేకరణ
మరిన్ని సేవలే లక్ష్యంగా అడుగులు
నాగర్కర్నూల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయం చేసే రైతులకు పంటల ఉత్పత్తి, దిగుబడి రావడంలో కీలకం భూమిలో ఉండే సారమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రైతులు అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటున్నది. ఫలితంగా పెట్టుబడులు పెట్టినా సరైన దిగుబడులు రాక చాలా మంది రైతులు అప్పుల పాలవుతుండటం పరిపాటిగా మారుతోంది. దీంతో రైతుల భూసార పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దీనికి గతంలో వ్యవసాయ అధికారులకు మినీ ల్యాబ్ల మాదిరిగా భూసార పరీక్షలను చేసే కిట్లను అందించింది. దీంతో రైతులు తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించి వివరాలు తెలియజేస్తున్నారు. అయితే క్లస్టర్ల వారీగా ఉన్న ఈ కిట్లతో వ్యవసాయ మండల కార్యాలయంలోనే ఈ పరీక్షలు చేయడం కష్టంగా మారింది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో మండలాల నుంచి రైతుల భూముల శాంపిళ్లను సేకరించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో నమూనా భూసార పరీక్షలను చేపట్టడం జరుగుతోంది.
భూసార శాంపిళ్ల సేకరణ ఇలా…!
రసాయనిక ఎరువులతో సేద్యం చేయడం వల్ల భాస్వరం నిల్వలు భూమిలో పేరుకుపోతున్నాయి. అలాగే నత్రజని, పొటాషియం మోతాదుల్లోనూ తేడాలు వస్తున్నాయి. భూమిలో సేంద్రియ కర్బనం స్థాయిలను పెంచాల్సి ఉంటుంది. మట్టి పరీక్షలతో సేంద్రియ కర్బనం ఏ మోతాదులో ఉందో తెలుస్తుంది. నేల స్థితి ఎలా ఉందో, నేల స్వభావం పీహెచ్ శాతం సైతం 6.5నుంచి 7.5శాతం ఉంటే అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది. అదే 4.5నుంచి 6వరకు ఉంటే ఆమ్ల లక్షణాలు ఉన్నట్లు, 8శాతం..ఆపై ఉంటే క్షారంతో(చౌడుతో) ఉన్న నేలలుగా పరిగణించడం జరుగుతుంది.
ఆమ్లం, క్షార భూముల్లో పంటల దిగుబడి ఉండదు. అదే విధంగా నత్రజని, భాస్వరం మోతాదులను ఈ భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. రైతు పండించే పంటలకు ఆ భూమి ఆనుకూలంగా ఉన్నదీ, లేనిదీ దీని ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవసాయాధికారి అందుబాటులో లేకున్నా రైతులే స్వయంగా మట్టి సేకరణ స్వయంగా చేసుకోవచ్చు. దీనికోసం వర్షం పడి నేల బాగా తడిగా ఉన్న నేలల్లోని మట్టిని సేకరించవద్దు. అప్పుడే దున్నినా సేకరించవద్దు. గట్ల వెంబడి, ఎరువు కుప్పల అడుగుభాగంలో మట్టిని సేకరించవద్దు. పంట ఉన్న భూముల్లోనూ మట్టి తీసుకోవద్దు. ఏప్రిల్, మే మొదటి వారం చాలా అనుకూలం. ఈ కాలంలో పంటలు ఉండకపోవడం, ఎరువులు వేసి ఉండకపోవడంలాంటి కారణాలతో భూమి బాగా ఆరి ఉంటుంది. ఎకరం భూమిలో నాలుగు లేదా ఐదు చోట్ల మట్టి నమూనాలు ఎకరాకు 3,4కిలోల మట్టిని సేకరించాలి. దీనికిగాను వీ ఆకారంలో 9అంగుళాల వరకు గడ్డి లేకుండా తవ్వాలి. భూమి పై నుంచి ఇలా తవ్విన మట్టిని కుప్పగా పోసి నాలుగు భాగాలుగా విభజించాలి. ఇలా చేసిన కుప్పలో నుంచి ఎదురెదురు కుప్పలను తీసి, మరో పక్కనున్న కుప్పలను ఒక్కటిగా కలపాలి. ఇలా చేశాక ఈ కుప్పనూ మరో నాలుగు భాగాలుగా తీసి ఎదురెదురు భాగాలను మళ్లీ తీయాలి. ఇలా తీసిన దాంట్లో మిగిలిన అరకిలో మట్టి నమూనాను రైతులు భూసార పరీక్ష కోసం అందించవచ్చు. ఇందులో రైతు గతంలో వేసిన పంట, రాబోయే సీజన్లో ఏ పంట వేసేది అధికారులకు తెలియజేయాలి. సేంద్రియ కర్బనం 2నుంచి 3వరకు పెరుగుతుంది. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపితే పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ప్రతి రెండేళ్లకోసారి ఇలా రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. పండ్ల తోటలు వేసే రైతులు మాత్రం మూడు అడుగుల లోతులో నుంచి మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది.