శేరిలింగంపల్లి : అర్థరాత్రి అక్రమంగా ఇంట్లోకి చొరబడి బెడ్రూంలో నిద్రిస్తున్న యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతి అరుపులతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సదరు ఉన్మాదిని పట్టుకొని చితకబాదారు. కత్తిపోట్లతో గాయాలకు గురైన యువతి, కుటుంభసభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఉన్మాది వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్ల ప్రాంతానికి చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్బీ కాలనీలోని ఏంఎన్ఆర్ కళాశాలలో డీగ్రీ చదువుతున్నాడు. ప్రేమ్సింగ్కి దూరపు బందువు వట్టినాగుల పల్లికి చెందిన ఓ యువతి (21) మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.
కాగా బుధవారం ఆర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వట్టినాగులపల్లిలోని సదరు యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ ప్రేమ్సింగ్ బెడ్రూంలోకి ప్రవేశించి యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసి ప్రేమ్సింగ్ను అడ్డుకునేందు కు ప్రయత్నించింది. యువతి అరుపులు విన్న ఆమె కుటుంబసభ్యులు ఉన్మాది ప్రేమ్సింగ్ను పట్టుకొని చితకబాదారు.
ఈ దాడిలో యువతికి గొంతుబాగంతో పాటు చేయి, అరచేయి, మణికట్టు బాగాల్లో కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని కాంటినెంటల్ హాస్పటల్కు తరలించారు. యువతి కుటుంబం చేతిలో ప్రేమ్సింగ్కు తలకు గాయమై కొండాపూర్లోని కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, వీరికి ముందు ఎమైన పరిచయం ఉందా…లేదా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు.