పశ్చిమబెంగాల్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. కూచ్బెహార్ జిల్లా సీతకూచ్ నియోజకవర్గంలోని జోర్పట్కీలో కేంద్ర భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఆ తర్వాత అల్లర్లను అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో అరడజను మంది గాయపడ్డారు. అదే నియోజకవర్గంలో మరోచోట గుర్తుతెలియని వ్యక్తి కాల్పుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా జరిగింది కాదు. బెంగాల్లో ఎన్నికల ప్రకటన, రాజకీయ ప్రచారం మొదలైనప్పటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే సాగుతున్నది. ఎన్నికల ప్రచారం రాజకీయ విమర్శల స్థాయిని దాటిపోయి, ప్రత్యర్థివర్గాలపై పైచేయి సాధించే ప్రక్రియగా మారింది. ఈ క్రమంలో ఇరుపక్షాల నేతల ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి.
ఎన్నికల ముందునుంచే ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ, మూడు, నాలుగు విడతల పోలింగ్ సందర్భంగా తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. ఈ హింసా రాజకీయాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా మల్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. కేంద్ర బలగాలను దింపిన బీజేపీ బెంగాల్ ఓటర్లను భయపెట్టేందుకు కాల్పులు జరిపించిందని మమతా ఆరోపిస్తుండగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే కూచ్బెహార్ లాంటివి మరిన్ని చూడాల్సి వస్తుందని బీజేపీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించటం గర్హనీయం. ఎవరెన్ని విధాల బెదిరింపులకు దిగినా తలొగ్గేది లేదని, తమ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని మమతా బెనర్జీ ఉద్ఘాటిస్తుండగా, బెంగాల్లో మార్పునకు సమయం ఆసన్నమైందని, తృణమూల్ బంగాళాఖాతంలో కలువటం ఖాయమని మోదీ ప్రకటిస్తుండటం నాయకుల ఘర్షణ పూరిత ధోరణిని సూచిస్తుంది.
బెంగాల్లోని హింసాత్మక రాజకీయాలకు అన్ని పక్షాల బాధ్యత ఉన్నది. మమతా బెనర్జీది దూకుడు స్వభావం. మరోవైపు బీజేపీ ఎక్కడా లేనివిధంగా పశ్చిమబెంగాల్ ఎన్నికలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పశ్చిమబెంగాల్లో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ను నెల రోజుల సుదీర్ఘ ప్రక్రియగా ప్రకటించి, ఎనిమిది దశలలో పోలింగ్ నిర్వహించడంపైనే విమర్శలున్నాయి. 71 వేల కేంద్ర భద్రతా బలగాలు, 35 వేల మంది స్థానిక పోలీసుల సాయంతో శాంతిని కాపాడలేకపోవటం వైఫల్యమే. అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రకటనలు, ప్రణాళికలు ప్రచారం చేసుకోవలసిన సందర్భంలో దుర్భాషలు వినిపిస్తున్నాయి, దౌర్జన్యాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పక్షాల విపరీత పోకడల వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యమవుతుంది. పార్టీ విధేయతలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులందరూ ఈ హింసా రాజకీయాలను ఖండించాలి.