బంజారాహిల్స్,సెప్టెంబర్ 8 : పాతకక్షలతో కర్రలతో దాడికి పాల్పడ్డ ముగ్గురిమీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్నగర్లో నివాసం ఉంటున్న సయ్యద్ నయీమ్ అనే వ్యాపారి ఇంటిపక్కన సోదరుడు సయ్యద్ దస్తగిరి ఉంటాడు.
జూలై నెలలో తానుంటున్న ఇంట్లో అక్రమంగా కరెంట్ కనెక్షన్ తీసుకుంటున్న దస్తగిరి గురించి నయీమ్ విద్యుత్శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాంతో కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు నిలిపివేశారు. తన ఇంట్లో కరెంట్ కనెక్షన్ తీసుకోకుండా నయీమ్ అడ్డుపడ్డాడన్న కక్షను పెంచుకున్న దస్తగిర్ రెండ్రోజుల క్రితం అకారణంగా నయీమ్తో గొడవకు దిగాడు.
మాటామాటా పెరగడంతో దస్తగిరి, సోదరుడు సలీమ్, సయ్యద్ అమీర్ అనే వ్యక్తులతో కలిసి నయీమ్పై కర్రలతో దాడికి దిగారు. దాడిలో నయీమ్తో పాటు సయ్యద్ జానీ అనే వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు నయీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.