జహీరాబాద్, జూలై 7: ఏడు ఎకరాలు.. 32 తరగతి గదులు.. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు.. గ్రంథాలయం.. క్రీడా మైదానం.. పార్కు.. జిమ్.. హాస్టల్.. నమాజ్ కోసం ప్రత్యేక గది.. ఇదేదో యూనివర్సిటీ కాదు. తొలిసారిగా మైనార్టీ బాలికల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచినెల్లిలో స్థాపించిన గురుకుల విద్యాలయం. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించడం ఈ విద్యాలయం ప్రత్యేకత. పాఠశాల ఆవరణలోనే నివాసం ఉండేందుకు వీలుగా ప్రిన్సిపాల్ కోసం ప్రత్యేక భవనం నిర్మించడం మరో విశేషం. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ఈ గురుకులం వివిధ రాష్ర్టాల వారినీ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే ఈ విద్యాలయాన్ని కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ గురుకులంలో తాజాగా ఏర్పాటుచేసిన జూనియర్ కళాశాలను ఆర్థికమంత్రి హరీశ్రావు మంగళవారం ప్రారంభించారు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తుండటంతో ఈ గురుకులంలో వృత్తి విద్యా కోర్సులు కూడా ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.
మైనార్టీల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
సీఎం కేసీఆర్ మైనార్టీ బాలికల కోసం తొలిసారిగా జహీరాబాద్లో గురుకులం స్థాపించడం సంతోషకరం. మైనార్టీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు గురుకులాలు లేవు. చదువుకొనే స్థోమత లేని పిల్లలు కార్మికులుగా పనిచేసేవారు. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు స్థాపించడంతో ఎందరో విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలో చదువుకొంటున్నారు.
-షేక్ ఫరీదు, రైల్వేబోర్డు సభ్యుడు
మైనార్టీ గురుకుల భవనానికి మంత్రి కేటీఆర్ ఫిదా
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచినెల్లి శివారులో ప్రారంభించిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల భవనం చాలా అందంగా ఉన్నదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటి మైనార్టీ గురుకుల పాఠశాల భవనాన్ని జహీరాబాద్లో అత్యాధునిక హంగులతో ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.