నందికొండ, మే 19 : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, కరోనా రోగులకు ఎటువంటి కొరత లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానను బుధవారం ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులను కలియతిరిగి పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమలా నెహ్రూ దవాఖానలో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు 80 బెడ్లు, మందులు, అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. దవాఖానలోని కరోనా రోగులకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ అవసరమైన వారికి ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం అందిస్తున్నారన్నారు. కమలానెహ్రూ దవాఖానలో ఇప్పటి వరకు 13,471 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,247 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు.
అందులో 378 మంది దవాఖానలో చేరగా, 309 మంది కోలుకొని డిశ్చార్చి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 28 మంది చికిత్స పొందుతున్నారని, ఇంకా 52 మందికి వైద్యం అందించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. చుట్టుపక్కల మండలాల ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దవాఖానలో విద్యుత్ సమస్య లేకుండా కొత్త జనరేటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొవిడ్ లక్షణాలున్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందాలన్నారు. ఇంటింటి సర్వేను నిర్వహించి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా అదుపులో ఉందని, తప్పుడు వార్తలను నమ్మి భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ భగవాన్నాయక్, డీఎంహెచ్ఓ కొండల్రావు, డీటీహెచ్ మాతృనాయక్, దవాఖాన సూపరింటెండెంట్ భానుప్రసాద్, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, నిమ్మల ఇందిర, రమేశ్, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.