న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యులు, ఆధునిక వైద్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపై రూ 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం తాజాగా తమతో చర్చకు రావాలని యోగ గురువుకు సవాల్ విసిరింది. రోగులకు చికిత్స కోసం పతంజలి మందులను ఏ అల్లోపతి దవాఖాన వాడిందో చెప్పాలని ఐఎంఏ ఆయనను నిలదీసింది. కొవిడ్-19 వ్యాక్సిన్లు, ఆధునిక వైద్యంపై చేసిన వ్యాఖ్యలను రాందేవ్ ఉపసంహరించుకుంటే ఆయనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులను వెనక్కితీసుకుంటామని ఐఎంఏ జాతీయ చీఫ్ డాక్టర్ జేఏ జయలాల్ పేర్కొన్న నేపథ్యంలో ఐఎంఏ ఉత్తరాఖండ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
రాందేవ్ కు ఐఎంఏ వ్యతిరేకం కాదని జయలాల్ స్పష్టం చేశారు. ఆధునిక వైద్యాన్ని, చికిత్సను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వాస్తవానికి రాందేవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాందేవ్ కు పెద్దసంఖ్యలో అనుచరగణం ఉండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయనే ఆందోళన తమలో ఉందని పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా పదివేల మంది వైద్యులు కరోనాతో మరణించారని రాందేవ్ వ్యాఖ్యానించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.