నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు జిల్లాల నుంచి నగరానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ దూరంలో 348 కి.మీ పొడవునా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ మహానగరాభివృద్ధితోపాటే రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త ఊపునిస్తుంది. ఈ బడ్జెట్లో రీజినల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్లు కేటాయించింది. మొదటి దశలో నగరానికి ఉత్తర దిక్కున సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు భూసేకరణ చేయనున్నారు. కాగా 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ పెట్టుబడులకు కేంద్రంగా, కొత్త ఆవాసాలకు నిలయంగా మారడంతో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధి చెందింది. అదే తరహాలో రీజినల్ రింగ్ రోడ్డు సైతం పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.