హరితహారంలో భాగంగా ఏడో విడత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. తొలకరి జల్లులు కురవడమే తరువాయి.. గ్రేటర్ హైదరాబాద్ను మరింత హరితమయంగా మార్చడమే లక్ష్యంగా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించింది. ఈ విడతలో కోటి మొక్కలు నాటాలని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకున్నది.
గ్రేటర్ వ్యాప్తంగా ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్లతో పాటు జాతీయ రహదారుల వెంట భారీ ఎత్తున మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. వీటితో పాటు 700 ట్రీ పార్కులతో పాటు 75 చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టనుంది. ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ , ఎన్జీఆర్ఐలతో పాటు ఎక్కువ స్థలాలున్న సంస్థలు, ఖాళీ స్థలాలున్న దేవాదాయ శాఖ భూముల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద విరివిగా మొక్క లు నాటనున్నారు. వీటి తో పాటు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో డివిజన్లలో గ్రీన్ ప్రణాళికలను అమలు చేసి ..గ్రేటర్ను హరితమయంగా తీర్చిదిద్దనున్నారు.
గ్రీన్ హైదరాబాద్కు జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. గ్రేటర్లో పచ్చదనం పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గింపు కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఉధృతంగా చేపట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 600 నర్సరీలను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లకుగానూ ఒక్కో జోన్లో 100 నర్సరీల చొప్పున 600 నర్సరీలను ఏర్పాటు చేసింది. వార్డు ఆఫీసులు, ఖాళీ స్థలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసిన అధికారులు.. ఒక్కో నర్సరీలో 25 వేల చొప్పున మొక్కలను సిద్ధం చేశారు. రోడ్ల వెంట ఏపుగా పెరిగే మొక్కలు, ఫ్లై ఓవర్లకు వర్టికల్ గార్డెన్లకు వీలుగా, హెర్బల్ మొక్కలు, ఇంటి పరిసరాలు, బాల్కానీల్లో పెంచేందుకు వీలుగా హోం నీడ్స్, పండ్ల మొక్కలను సిద్ధం చేశారు. హరితహారం పథకం కింద కోటి మొక్కలను నాటడంతో పాటు ప్రజలకు ప్రత్యేక కేంద్రాల ద్వారా మొక్కలను పంపిణీ చేయనున్నారు.