హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ తెలిపింది. మే 10వ తేదీలోగా దరఖాస్తులను పంపించాలని కోరింది. ఈ మేరకు నమూనా దరఖాస్తును రూపొందించింది. డెత్ సర్టిఫికెట్తోపాటు పనిచేస్తున్న మీడియా పేరు, అక్రెడిటేషన్ కార్డు, కొవిడ్-పాజిటివ్ రిపోర్ట్, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు, వారసుల వారసత్వ సర్టిఫికెట్ను దరఖాస్తులకు జతచేయాలి. వీటిని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మసాబ్ట్యాంక్, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్ చిరునామాకు పంపంచాలి. దరఖాస్తులను పరిశీలించి కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్టుల ఒక్కో కుటుంబానికి తక్షణంగా రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తారు. ఈ మేరకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు 040-23298672/74 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.