హైదరాబాద్ : నిరుపేదలకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్లు జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం ఒక్కరోజే 45 వేల భోజనాలను అందించింది. రోజువారీ కూలీలు, కార్మికులు, హాకర్లు, షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందేవారికి అన్నపూర్ణ క్యాంటీన్లు ఓ వరంగా మారాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంటీన్లకు తోడుగా గురువారం డజన్ల సంఖ్యలో నూతన క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.
గురువారం నగరంలోని 250 క్యాంటీన్లు వివిధ ప్రాంతాలలో 45 వేల మందికి పైగా ఆహారాన్ని అందించాయి. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లకు అదనంగా మరో 102 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారంతో నూతన క్యాంటీన్లన్నీ అందుబాటులోకి వస్తాయని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కష్ట కాలంలో తమకింత భోజనం పెడుతున్న ప్రభుత్వానికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.