ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి ఎవ్వల డబ్బును వాళ్ల ఖాతాల్లో జమచేసింది. కల్లాల్లోనే కాంటా వేసి లోడు ఎత్తే దగ్గర కొద్దిల ఎనకముందైనా ఇదివరకటి షావుకారు లెక్కకు, మార్కెట్లో తాతలు, తండ్రులు పడిన తిప్పలతో పోల్చుకుంటే నూరుపాళ్లు మేలు.
కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు దేనికది ఓ ప్రణాళిక ప్రకారం రైతులకు అందుబాటులో ఉండటంతో తెలంగాణ రైతాంగం మునుపెన్నడూ లేనంత సంతోషంగున్నది. ‘భూమి పుట్టినప్పటి నుంచి ఎన్నడూ ఇన్ని వడ్లు పండలె. గిట్ల వరసన మూడునాలుగేండ్లు కాలమై పంట అక్కరకొస్తే ఒక్కొక్కరం కుబేరులమైతం’ అంటున్నరు రైతులు.
గతించిన రోజులను, వంపునపడ్డ నీళ్లను మలుపుకరాలేమన్నది లోకోక్తి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తిరగరాసింది. వ్యవసాయరంగాన్ని అన్నిరకాల సంక్షో భం నుంచి పరిరక్షించాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంటే, ఆ సంకల్పానికి మద్దతునిస్తూ ఉద్యోగ ధర్మంగా కాకుండా ప్రజల పట్ల భక్తిప్రపత్తులున్న ఉద్యోగులు ఉండాలి. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్శాఖల ఉద్యోగుల కర్తవ్య పారాయణత్వం ప్రభుత్వానికి, రైతాంగానికి బాగా కలసివచ్చిన అంశం. ఉద్యమకాలంలో సకల జనులతో ఉద్యోగులూ భుజం కలిపి పోరాడిన అనుభవం మూలాన్నే స్ఫూర్తివంతంగా విధులు నిర్వహిస్తున్నరు. మునుపటి ప్రభుత్వాలకు తెలియక కాదు, చిత్తశుద్ధి కొరవడినందున గతంలో జలవిధానం అస్తవ్యస్థంగా ఉండేది. వర్షపాతాన్ని బట్టి పారే నదీజలాలను కాలువల ద్వారా ఉపయోగించుకోవడం ఒక పద్ధతి. ప్రతి చినుకును చెరువులు కుంటల్లో భద్రపరచుకొని భూగర్భ జలాలను వృద్ధి చేసుకోవడం, తూముల ద్వారా వాడుకోవడం రెండో పద్ధతి. కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవడం ద్వారా మొదటి పద్ధతిలో, మిషన్ కాకతీయ పథకం ద్వారా రెండో పద్ధతిలో జల సంరక్షణ చేపట్టి నీటిపారుదల శాఖ అద్భుతంగా జలాలను పొలాలకు అందించగలిగింది. ఇందుకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించాల్సిందే. నాణ్యమైన విద్యుత్తును అందించిన రాష్ట్ర జెన్కో, ట్రాన్స్కో సిబ్బంది సేవలనూ వేనోళ్లా స్తుతించాల్సిందే.
రాష్ట్ర ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి రెండూ తనే కావడం వల్ల ఉద్యమ ఆకాంక్షలను పాలనా వ్యవహారాలతో ప్రతిభావంతంగా కేసీఆర్ అనుసంధానం చేయగలిగారు. చిక్కిశల్యమైన గ్రామ సీమల్లో ఉద్దీపన మొదలవ్వాలంటే కీలక రంగమైన వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయాలి. ముఖ్యమంత్రి ఇదే లక్ష్యంగా పెట్టుకున్నరు. రైతుకు అండగా నిలబడాలనుకున్నరు, భరోసా ఇవ్వాలనుకున్నరు. ఈ ప్రయాణంలో ప్రభుత్వాధినేతగా ఏడేండ్లుగా కేసీఆర్ పరితపిస్తూ వచ్చారు. అది ఉత్త పరితాపంగా కాకుండా ఆచరణాత్మకంగా ముందుకెళ్లడంతో దేశంలో అన్ని రాష్ర్టాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవగలిగింది. వాగులు, వంకలు తేమతో ఇంపుసొంపులు పోతున్నయి. చెరువులు, కుంటలు ఏడాదికాలంగా తెరపి లేకుండా అలుగులు దుంకుతున్నయి. పాడి, మత్స్య పరిశ్రమ, జీవాల పెంపకం ముందడుగేసినయి. ఈ దృశ్యం బంకించంద్రుడు వర్ణించిన ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’కు దర్పణం పడుతున్నది. గంగను ప ల్లెపల్లెనా పారించి రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా గళ్ల నీరాజనం, వరిమళ్ల సుప్రభాతం.
డాక్టర్ బెల్లి యాదయ్య