హైదరాబాద్: స్నేహితుని పుట్టినరోజు వేడుకలు. అంతా సరదాగా గడుపుతున్నారు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి సరదాగా బొమ్మాబొరుసు ఆడుతున్నారు. ఇది మిగతా వారిని ఆకర్షించింది. ఇంకేముంది చాలా మంది జమయ్యారు. గెలుపోటములతో సంబంధంలేకుండా పందెం కడుతూ మజా చేస్తున్నారు. ఇంతలో పోలీసులు సీన్లోకి ఎంటరయ్యారు. అందరినీ అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన ఘనత హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆదివారం రాత్రి.. చింతల్లోని ఐడీపీఎల్లో ఉన్న ఎంపీఆర్ కన్వెన్షన్హాల్లో శ్రీనాథ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వారిలో గోపాల్, శ్రీనాథ్, సంతోష్, శ్రీనివాసులు అనే వ్యక్తులు సరదాగా రూ.1 నాణెం ఉపయోగించి బొమ్మాబొరుసు ఆడటం మొదలు పెట్టారు. ఇంకేముంది ఆ నలుగురికి మరో 38 మంది తోడయ్యారు. బెట్టింగ్తో ఆట ముమ్మరంగా సాగుతున్నది. విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగారు. నిషేధిత బెట్టింగ్ ఆడుతున్న 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.4.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.