సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 13: జాతీయ పైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూలై 15 నుంచి 17 వరకు పైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం, ఉచిత మాత్రల పంపిణీ ఉంటుందన్నారు. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2021 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి 17 వరకు పైలేరియా, నులి పురుగుల నిర్మూలనకు ఉచిత మాత్రల పంపిణీ చేపడుతున్నట్టు వెల్లడించారు. పైలేరియా రాకుండా ప్రజలు సంవత్సరానికి ఒకసారి డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు మింగాలని, వ్యాధికారక దోమలను అరికట్టాలని, దోమ కాటుకు గురికాకుండా చూసుకోవాలని వివరించారు. పైలేరియా వ్యాధికి తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఈసీ మాత్రలు సూక్ష్మ పైలేరియాను నశింపచేస్తుందన్నారు. అంల్బెండజోల్ పేగుల్లో ఉండే క్రిములను నిర్మూలిస్తుందన్నారు. గర్భిణులు, రెండేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ డీఈసీ మాత్రలు తీసుకోరాదని స్పష్టం చేశారు. మిగతా వారు విధిగా తీసుకోవాలని సూచించారు.
డోసు ఈవిధంగా…
రెండు నుంచి ఐదేండ్లలోపు పిల్లలు డీఈసీ, అల్బెండజోల్ ఒక మాత్ర చొప్పున తీసుకోవాలని రాజర్షి సూచించారు. అందుకు 37 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మాత్రల పంపిణీకి 6,353 మంది ఆశ, అంగన్వాడీ, హెల్త్ వర్కర్లు, ఇతర వలంటీర్లను, 635 మంది సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. 39,71,035 డీఈసీ మాత్రలు, 15,88,144 అల్బెండజోల్ మాత్రలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం జాతీయ పైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాలను అదనపు కలెక్టర్ రాజర్షి విడుదల చేశారు. సమావేశంలో డీఎంహెచ్వో గాయత్రీ దేవి, డీపీవో సురేశ్ మోహన్, సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.