హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతినెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
స్తుతం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్కు నివేదికలు సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్లో చర్చ జరగ్గా.. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను ముఖ్యమంత్రి మంజూరుచేశారు.
నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో వైపు రాష్ట్రంలోని భూముల విలువ పెంపు, రిజిష్ట్రేషన్ చార్జీల పెంపుపై కేబినెట్లో కొనసాగుతున్న ప్రత్యేక చర్చ కొనసాగుతున్నది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం లాండ్ పూలింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధాలాను అన్వేషించాలని మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.