సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ సీటీసీ ప్రాంగణం పచ్చదనంతో నిండిపోయింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గత ఆరేండ్లలో నాటిన వేలాది మొక్కలు ఇప్పుడు చెట్ల రూపం దాల్చి పచ్చదనాన్ని పరిచాయి. ఈ ప్రాంగణం కంటి నిండా పచ్చదనంతో కనిపిస్తూ స్వచ్ఛమైన గాలినిస్తుంది. ఇక్కడ నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు ప్రత్యేకంగా 10 మంది సిబ్బందిని కేటాయించారు. వీరికి కూడా మొక్కలపై ప్రేమ ఉండటంతో ప్రతి రోజు వాటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడగలిగారు. ఇక్కడ సపోటా మొక్కను నాటిన సీపీ సజ్జనార్ తరచుగా ఆ మొక్క పెరుగుదలను పరిశీలిస్తున్నారు. తాజాగా సీపీ సజ్జనార్ తన కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులతో కలిసి పూల మొక్కలు నాటారు. అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 45 పోలీసు స్టేషన్లలో మొక్కలు నాటేలా అధికారులు కార్యక్రమాలను నిర్వహించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీపీ ఆదేశించారు. దీంతో అధికారులు, సిబ్బంది మొక్కల పెరుగుదలపై దృష్టి సారించి, నిరంతరం పరిశీలిస్తున్నారు.