అమరావతి,జూలై:హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ సృష్టించి న్యాయ విచారణకు హజరు కాకుండా తప్పించుకున్నాడని అతనిపై బోయినపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ప్రవీణ్ రావు సోదరులు అపహరణ కేసులో న్యాయస్ధానానికి హాజరుకావటం ఇష్టంలేని అతను తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. రిపోర్ట్ చుసిన పోలీసులకు అనుమానం కలగడంతో విచారణ చేపట్టగా అదిఫేక్ సర్టిఫికెట్ అని తేలింది.దీంతో రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబరేటరీ లైసెన్స్ రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.
కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్ గత శనివారం బోయినపల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ కు వాట్సప్ లో మెసేజ్ పంపించాడు. న్యాయస్ధానంలో ఈ విషయం వివరించేందుకు ఎస్సై ఈ సర్టిఫికెట్ ను తన ఉన్నతాధికారులకు పంపించాడు. అది చూసిన ఉన్నతాధికారులు అందులో పేర్లు, అక్షరాలలో దిద్దుబాట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రిపోర్టు ఇచ్చిన కూకట్ పల్లిలోని గాయత్రీ ల్యాబరేటరీకి వెళ్లి ల్యాబ్ నిర్వాహకులు వినయ్,రత్నాకరావులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో వివరించారు. రూ.1200 తీసుకుని పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు వారు తెలిపారు.