న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త పేర్కొన్నారు. పలు దేశాల్లో టీకాలు తీవ్రమైన కేసులు, ఆసుపత్రులకు వెళ్లడాన్ని తగ్గిస్తున్నా.. చాలా చోట్ల ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకల కొరత ఎదురవుతోందని, భారీగా మరణాలు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
గత 24 గంటల్లో ఐదులక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, సుమారు 9,300 మరణించారని పేర్కొన్నారు. ఆఫ్రికాలో గత రెండు వారాలుగా కొత్త కేసుల్లో 30 నుంచి 40శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు. వీటిని పరిశీలిస్తే ‘కరోనా.. తగ్గే మహమ్మారి’లా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా సాగకపోవడం, ప్రజలు మాస్క్లు, సామాజిక దూరం నిబంధనలు పాటించకపోవడం, నిబంధనల సడలింపే కారణాలుగా పేర్కొన్నారు.