హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ)/కమలాపూర్: జనం గుండెల్లో సీఎం కేసీఆర్ ఉంటే.. గోడల మీద రాతల్లో ఈటల రాజేందర్ మిగిలిపోతాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతుబంధు తీసుకున్న రైతు గుండెలో.. కల్యాణలక్ష్మి తీసుకున్న ఆడపడచుల హృదయాల్లో.. కేసీఆర్కిట్ తీసుకున్న గర్భిణుల చిరునవ్వు మొహాల్లో…ఆసరా పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల బోసినవ్వుల్లో.. వికలాంగుల జీవితాల భరోసాలో సీఎం కేసీఆర్ శాశ్వతంగా చెరగని సంతకం చేస్తున్నారని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, సింగి ల్ విండో మాజీ చైర్మన్ నాయినేని తిరుపతిరావు తన 300 మంది అనుచరులతో మంత్రి సమక్షంలో గులా బీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హూజూరాబాద్ గడ్డ ముమ్మాటికీ టీఆర్ఎస్ అడ్డా అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే పాఠాలు నేర్పిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన ప్రగతి ఫలాలను ఆస్వాదిస్తున్న ప్రజల సంతోషంలో తాము భాగస్వామ్యం అవుతామని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. నియోజకర్గంలోని అన్ని మండలాల నుంచి గ్రామాల వారీగా కుల సంఘాలు. వ్యాపార, వాణిజ్య సంఘాలు, యూత్ అసోసియేషన్లు టీఆర్ఎస్లో చేరుతూ తమ ఐక్యతను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై వచ్చి తమ బలం సీఎం కేసీఆర్ అని, తమ బలగం టీఆర్ఎస్ అని నిరూపిస్తున్నారని ఆయన చెప్పారు.
ఉప్పల్ కాంగ్రెస్ ఖాళీ
కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన 300 మంది టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. ఉప్పల్ మాజీ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి శ్రీధర్రావు, కురుమసంఘం అధ్యక్షుడు కొనుపుల రాంచందర్, బుడిగ జంగాల రాష్ట్ర నాయకుడు తుర్పాటి పైడి, వార్డు సభ్యుడు ఎర్రబెల్లి తిరుపతిరావు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ ఎర్రబెల్లి రామారావు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మహారాజు స్వామి, బీజేపీ నాయకులు గడిపె రాజు, రమేశ్తోపాటు వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు 300 మంది మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలోని గ్రామాలకు గ్రామాలే గులాబీ పార్టీకి జై కొడుతుండడంతో ప్రతిపక్షాల్లో గుబులు పెరుగుతున్నది.