సీఎం కేసీఆర్ నెలకు 300 కోట్లిస్తున్నరు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కమలాపూర్/భీమారం, జూలై 9: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలేదని, సీఎం కేసీఆర్ నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, హన్మకొండ మండలంలోని పలివేల్పులలో పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లకు డబ్బులిస్తే ఒక్కటి కూడా కట్టియ్యలేదని ఈటలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
టీఎన్జీవోలతో కలిసి మొక్కలు నాటిన మంత్రులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం పలివేల్పులలోని టీఎన్జీవోస్ ప్లాట్స్లో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రులు దయాకర్రావు, సత్యవతిరాథోడ్ మొక్కలు నాటారు.
సంచలనాల కోసమే దుష్ప్రచారం: మంత్రి ఎర్రబెల్లి
తనకు మహిళా ఉద్యోగులు, అధికారుల పట్ల గౌరవం ఉన్నదని.. సంచలనాల కోసం తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు, పచ్చదనం పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారంటూ అడుగుతూ.. తెలంగాణ ఉచ్ఛరణలో ‘మీరు బాగా పనిచేస్తున్నారు, ఇంకా అందరిని ఉరికించి పనిచేయించండి’ అంటూ ప్రోత్సహించానని చెప్పారు. కానీ, కొందరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను కార్యక్రమానికి వెళ్లగానే ‘ఏం బిడ్డా (కూతురు) బాగున్నావా’ అంటూ పలుకరించానని గుర్తుచేశారు.