హైదరాబాద్ : సింగరేణి బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలిసి మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఏ హామీలు అయితే ఇవ్వడం జరిగిందో.. అన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏడు సంవత్సరాలుగా ప్రతి కార్మికుడికి లాభం చేయడం జరిగిందన్నారు. న్యాయపరమైన చిక్కులను సావధానంగా పరిష్కరించుకుందామని తెలిపారు.
13 నుంచి 14 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, మరో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పరోక్షంగా సింగరేణి కార్మికుల పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీతో కలిసి క్రియాశీలకంగా పని చేయాలన్నారు. కెంగర్ల మల్లయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే.. ఇతర సంఘాలకు, పార్టీలకు నూకలు చెల్లవు అని స్పష్టం చేశారు. కార్మికులందరూ ఏకపక్షంగా ఉండాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కార్మికులతో కలిసిపోవాలన్నారు. అందరం కలిసికట్టుగా నడవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.