పెద్దపల్లి, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రాత్రి లక్ష్మీబరాజ్ 10గేట్లు తెరిచి 23,900 క్యూసెక్కులు దిగువకు వదిలారు. లక్ష్మీపంప్హౌస్లో 2 మోటర్లతో 4,200 క్యూసెక్కులను సరస్వతి బరాజ్లోకి పంపిస్తున్నారు. ఇక్కడ మానేరు నీరు కూడా జత కలవడంతో 5,860 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. 8.83 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఈ బరాజ్లో ప్రస్తుతం 4.024 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఇక్కడ లెవల్ రీచ్ అయ్యాక పంప్హౌస్లో మోటర్లను ఆన్చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎల్లంపల్లి జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా కాళేశ్వరం లింక్-2లోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడ 3, 4వ మోటర్ల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ నంది జలాశయానికి, అక్కడి నుంచి జంట టన్నెళ్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్కు పంపిస్తున్నారు. ఇక్కడ 1, 3వ మోటర్లను ఆన్ చేసి 6,300 క్యూసెక్కుల నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు 0.3 టీఎంసీల నీటిని పంపించినట్టు అధికారులు తెలిపారు.