ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే థర్డ్ వేవ్ లో రెట్టింపు కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. యాక్టివ్ కేసులు 8 లక్షలకు చేరుతాయని కొవిడ్ టాస్క్ఫోర్స్ పేర్కొంది.
కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో టాస్క్ఫోర్స్ తమ అంచనాలు వెల్లడించింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ తలెత్తుతుందని, కేసుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపవుతాయని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారి వివరించారు. బ్రిటన్ లో సెకండ్ వేవ్ అనంతరం నాలుగు వారాల్లోగా థర్డ్ వేవ్ వ్యాప్తి చెందిందని కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా, సన్నద్ధతతో లేకుంటే మనం కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి పేర్కొన్నారు.
థర్డ్ వేవ్ లో గతంలోలానే పది శాతం కేసులు చిన్నారులు, యువతవే ఉంటాయని చెప్పారు. తదుపరి వేవ్ లో చిన్నారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రజలు ఒకేచోట గుమికూడటం, కొవిడ్-19 ప్రొటోకాల్స్ ను ఉల్లంఘించడం ఆందోళనకరమని సమావేశంలో పాల్గొన్న మరో అధికారి పేర్కొన్నారు.