న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసుల ప్రభావం ప్రయాణ వాహనాల విక్రయాలపై భారీగానే పడింది. కోవిడ్-19 కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు లాక్డౌన్లు విధించడంతో గత నెలలో ప్రయాణ వాహనాల విక్రయాలు 66 శాతం పతనం అయ్యాయని ఆటో ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియాం) పేర్కొంది.
గత నెలలో కేవలం 88,045 ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో వాహనాల విక్రయాలు జరుగలేదు. అందువల్ల ఈ ఏడాది ఏప్రిల్ విక్రయాలతో సరిపోల్చామని సియామ్ తెలిపింది.
2021 ఏప్రిల్లో 2,61,633 ప్రయాణ కార్లు అమ్ముడయ్యాయి. 2019 మే నెలలో 2,26,975 వాహనాలు విక్రయించారు. గత నెలలో 88,045 వెహికల్స్ అమ్ముడయ్యాయని సియామ్ వివరించింది.
ద్విచక్ర వాహనా సేల్స్ మరింత భారీగా తగ్గాయి. గత ఏప్రిల్ నెలలో 9,95,097 ద్విచక్ర వాహనాలు అమ్ముడు పోయాయి. కానీ గత నెలలో 3,52,717 బైక్స్, స్కూటీలు సేల్ అయ్యాయి. 2019 మే నెలలో 17,25,204 యూనిట్ల (బైక్స్, స్కూటీలు) అమ్ముడు పోయాయి.
మోటార్ సైకిళ్ల విక్రయాలు గత నెలలో 56 శాతం పడిపోయాయి. గత ఏప్రిల్ నెలలో 6.67,841 మోటారు సైకిళ్లు అమ్ముడు పోగా, గత నెలలో 2,95,257 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మే నెల అంతా లాక్డౌన్ కొనసాగడంతో వెహికల్స్ ప్రొడక్షన్, సేల్స్ నిలిచిపోయాయని సియామ్ డీజీ రాజేశ్ మీనన్ చెప్పారు.
లాక్డౌన్ వేళ పలు ఆటోమొబైల్ సంస్థలు ఉత్పత్తి నిలిపేసి, ఇండస్ట్రీయల్ అవసరాలకు ఉత్పత్తి చేయాల్సిన ఆక్సిజన్ను కోవిడ్-19 రోగుల అత్యవసర చికిత్స కోసం ఔషధ ప్రయోజనాల కోసం మళ్లించాయి.
2019 మేతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 61.2 శాతం, టూ వీలర్స్ సేల్స్లో 79.6, త్రీ వీలర్స్ విక్రయాలు 97.6 శాతం పడిపోయాయని సియామ్ డీజీ రాజేశ్ మీనన్ చెప్పారు. త్రీవీలర్స్ సేల్స్ కేవలం 1,251 యూనిట్లకు పరిమితం అయ్యాయి.