నగర ఎంట్రెన్స్ల వద్ద పనికిమాలిన జంక్షన్లు
ప్రణాళిక లేమితో గందరగోళంలో ప్రయాణికులు
వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటులో ఉన్నా నగరం దాటి దిక్కులు
కొట్టొచ్చినట్లుగా నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యం
లోపాలను సరిదిద్దేందుకు కుడా కార్యాచరణ
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి ఆధ్వర్యంలో కేంద్రానికి ప్రతిపాదనలు
వరంగల్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మెరుగైన రవాణా కోసం అత్యంత ఆధునికంగా నిర్మించిన 163వ జాతీయ రహదారి డిజైన్ లోపంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిజైన్ లోపాలు, కేంద్ర ప్రభుత్వ అధికారుల పట్టింపులేమి ఇప్పుడు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్నది. విశాలంగా ఉన్న కొత్త రోడ్డుపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారాల్సి ఉన్నా ఆగమాగం అవుతున్నది. ముఖ్యంగా వరంగల్ నగరంలోకి ప్రవేశ మార్గాల వద్ద గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఇష్టారీతిన వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.
దశలవారీగా పనులు..
హైదరాబాద్-వరంగల్ను అనుసంధానం చేస్తూ ఏటూరునాగారం మీదుగా ఛత్తీస్గఢ్లోని భూపాపట్నం వరకు ఉన్న ఈ రోడ్డు 1998లో జాతీయ రహదారిగా మారింది. గతంలో 202 నంబర్తో ఉండగా తర్వాత కేంద్రం 163గా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈ రహదారిని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట హైదరాబాద్ నుంచి ఆలేరు సమీపంలోని రాయగిరి వరకు నాలుగు వరుసలుగా మార్చింది. రెండో దశలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆరెపల్లి వరకు ఉన్న 99.10 కిలో మీటర్ల విస్తరణ పూర్తయ్యింది.
ఈ రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 1082 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది. 2016 జనవరి 4న ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్గడ్కరీ కలిసి జాతీయ రహదారి విస్తరణ పనులను వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ వద్ద ప్రారంభించారు. అదే ఏడాది జూన్ నుంచి పనులు మొదలయ్యాయి. 2020 డిసెంబరు 21న ఈ రహదారి అధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ నగరం, జనగామ, ఆలేరు, వంగపల్లి పట్టణాల్లో బైపాస్ రోడ్లతో కొత్త రహదారి నిర్మించారు. విస్తరణలో భాగంగా మూడు భారీ బ్రిడ్జిలు, 25 చిన్న బ్రిడ్జిలు, నాలుగు వెహికల్ అండర్పాస్ బ్రిడ్జిలు, వాహనాలు పైనుంచి వెళ్లేలా ఒక వీవోపీ, రెండు ఆర్వోబీలు, మూడు పాదచారుల అండర్పాస్లు కట్టారు.
డిజైన్లో లోపం.. ప్రయాణికులకు శాపం
వేలాది కోట్లు ఖర్చు చేసి విస్తరించిన ఈ జాతీయ రహదారి డిజైన్ లోపంతో హైదరాబాద్, కరీంనగర్, ములుగు వైపు నుంచి వరంగల్ నగరంలోకి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పలుమార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. జనగామ నుంచి నగరంలోకి వస్తుండగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద, రహదారి నుంచి కరీంనగర్ వైపు మళ్లే భీమారం జంక్షన్ వద్ద, పరకాల నుంచి నగరంలోకి ఎంటరయ్యే దామెర జంక్షన్ వద్ద లోపాలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద జంక్షన్లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
నగరంలోకి రావాలనుకునేవారు ఎలాంటి సైన్ బోర్డులు లేకపోవడంతో నేరుగా బైపాస్లో వేగంగా వెళ్లి నగరం దాటిపోతున్నారు. కిలో మీటర్ల మేర ప్రయాణం తర్వాత డ్రైవర్లు తేరుకుంటున్నారు. దీంతో సమయం వృథా కావడంతోపాటు ఆందోళన పడుతున్నా రు. భీమారం జంక్షన్లోనూ ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్, ఆరెపల్లి నుంచి వచ్చే వాహనాలు కరీంనగర్ వైపు మళ్లేందుకు భీమారం జంక్షన్లో దిగాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా డిజైన్ లోపంతో వేగంగా దిగే వాహనాలు, కరీంనగర్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. దామెర వద్ద జంక్షన్లో అత్యంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ములుగు వైపు నుంచి వచ్చే వాహనాలు వరంగల్ నగరంలోకి ఎంటరయ్యేందుకు సరైన అప్రోచ్ మార్గం లేదు. క్షణం ఏమరుపాటుగా ఉన్నా వేగంగా హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.
కుడా ఆధ్వర్యంలో కార్యాచరణ
జాతీయ రహదారిలో ఉన్న లోపాలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్న విషయంపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు జాతీయ రహదారుల సంస్థకు చాలాసార్లు విన్నవించారు. లాక్డౌన్ను సాకుడా చూపి సదరు సంస్థ పట్టించుకోవడంలేదు. ప్రమాదాలు, ఇబ్బందులు పెరుగుతుండడంతో ఇక కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చొరవ తీసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జాతీయ రహదారిపై నగర ప్రవేశ మార్గాల వద్ద విశాలమైన బట్టర్ ఫ్లై జంక్షన్లు నిర్మించాలని తలచింది.
ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారితోపాటు వరంగల్- కరీంనగర్-ఖమ్మం రహదారి (563) లోపాలను సరిదిద్దేందుకూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఎన్హెచ్ 563లో భాగంగా వరంగల్ నగరాన్ని బైపాస్ చేస్తూ కట్టాల్సిన రోడ్డు ప్రతిపాదనలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కొత్త రోడ్డు వేయకుండా 563ని భీమారం జంక్షన్ వద్ద 163కి కలిపి చేతులు దులుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 563 విస్తరణ ఉండేలా ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని ఎన్హెచ్ఏఐని కుడా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నది.