భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి లోన్ పేరుతో ఓ కుటుంబాన్ని రూ. 35 లక్షలకు ముంచారు ఇద్దరు సభ్యుల గ్యాంగ్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీలోని రామ్నగర్లో చోటుచేసుకుంది. శ్రీనివాస్, కోటేశ్ అనే ఇద్దరు మోసగాళ్లు సీఎం క్యాంపు కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్స్గా పనిచేస్తున్నామంటూ చెప్పుకుని గగులోతు శంకర్ అనే వ్యక్తిని ఫోన్లో సంప్రదించారు.
మీ కుమార్తె స్వాతికి పీడబ్ల్యూడీ కేటగిరిలో సీఎంఆర్ఎఫ్ కింద రూ. 30 లక్షలు వ్యాపారం ప్రారంభించుకునేందుకు వస్తాయని చెప్పారు. శంకర్ కుటుంబాన్ని ఉగాది పండుగ నాడు సందర్శించి స్వాతి బిజినెస్ లోన్కు అర్హురాలు కాదన్నారు. అయితే ఏం చింతించవద్దని ఇంటి లోన్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. కాకపోతే రూ.35 లక్షలు డిపాజిట్ చెల్లిస్తే రూ.60 లక్షలు తక్షణమే వస్తాయన్నారు.
డబ్బు సమకూరిన తర్వాత ఆ ఇద్దరి వ్యక్తులను శంకర్ సంప్రదించాడు. వారు వచ్చి శంకర్ వద్ద ఉన్న రూ. 35 లక్షలు తీసుకుని వారి వెంట తెచ్చిన బ్యాగును శంకర్కు ఇచ్చి వెళ్లారు. అందులో రూ.60 లక్షలు ఉన్నట్లుగా తెలిపారు. వారు వెళ్లిన అనంతరం మరుసటి రోజు బ్యాగు తెరిచిచూడగా అందులో పిల్లలు ఆడుకునే బొమ్మ కరెన్సీ నోట్లు ఉన్నాయి. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.