న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. సోమవారం నాటికి 12.69 కోట్లకుపైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 73,600 కేంద్రాలు సోమవారం పని చేశాయని, ఇప్పటి వరకు ఇదే అత్యధికమని, సగటున 40వేల కేంద్రాలు పని చేస్తున్నాయని పేర్కొంది. పని కేంద్రాల్లో టీకాలు వేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉందని మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మెగా వ్యాక్సిన్ డ్రైవ్లో భాగంగా తాత్కాలిక నివేదిక ప్రకారం.. సోమవారం రాత్రి 8 గంటల వరకు 12,69,56,032 డోసులు వేసినట్లు తెలిపింది.
94వ రోజు 31,03,474 డోసులు వేయగా.. 21,67,374 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 9,36,100 మందికి సెకండ్ డోస్ వేసినట్లు చెప్పింది. టీకా డ్రైవ్లో జనవరి 16న ప్రారంభించగా.. మొదట ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేస్తూ వస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తుండగా.. వచ్చే నెల నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం సోమవారం అనుమతి ఇచ్చింది.