మొబైల్ సాయంతోనే నగదు ఉపసంహరణ
ఎన్సీఆర్ కార్పొరేషన్ నూతన ఆవిష్కరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లను తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ ఏటీఎంలను ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), సిటీ యూనియన్ బ్యాంక్తో కలిసి వీటిని ప్రవేశపెట్టింది. డెబిట్ కార్డులకు బదులుగా భీమ్, పేటీఎం, గూగుల్పే లాంటి యూపీఐ ఆధారిత యాప్లను కలిగిన మొబైల్ ఫోన్లను ఉపయోగించి నగదును ఉపసంహరించుకునే వీలుండటం ఈ ఏటీఎంల ప్రత్యేకత.
ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకునేందుకు కస్టమర్లు ఏటీఎంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ మొబైల్ యాప్ నుంచి లావాదేవీకి అనుమతిస్తే సరిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ప్రతి లావాదేవీకీ మారుతుంది. కనుక దీన్ని ఎవరూ కాపీ చేసేందుకు వీలుండదు. దీంతో లావాదేవీల నిర్వహణలో భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా రూ.5 వేలకు మించి నగదు ఉపసంహరించేందుకు వీల్లేదు. కానీ మున్ముందు ఈ పరిమితిని పెంచే అవకాశమున్నది. ఈ అంశంపై కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో ఎన్సీఆర్ కార్పొరేషన్, ఎన్పీసీఐ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయి.
దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఆగ్నేయ ఆసియా విభాగ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. కార్డ్లెస్ విత్డ్రా గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సదుపాయాన్ని తొలుత సిటీ యూనియన్ బ్యాంక్కు చెందిన దాదాపు 1,500 ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం ఆ ఏటీఎంలలో ప్రస్తుతమున్న సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేశామని, హార్డ్వేర్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. కేవలం సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడం ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డ్లెస్ క్యాష్ విత్డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తేవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు