భారత రాజకీయాల్లో చాణక్యుడి పేరును తరుచూ వాడుతుంటారు. చాణక్య రాజనీతి పేరున రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అజేయమైనవిగా భావిస్తారు.ఈ చాణక్యుడు(విష్ణు గుప్తుడు) క్రీ.పూ. 3వ శతాబ్దిలో బౌద్ధం విశేషంగా వ్యాప్తి చెందుతున్న కాలంలో పుట్టినవాడు. కుల, వేద, మత వ్యవస్థను సమర్థిస్తూ వేద విద్యలన్నీ నేర్చినవాడే అయినా ఆ కాలం నాటి బౌద్ధం ప్రభావం ఇతనిపై కొంత ఉంది. తక్షశిల యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి అటు వేదవాద, ఇటు బౌద్ధవాద మానవీయతను సమానంగా అర్థం చేసుకున్నవాడు.
చాణక్యుని రాజనీతిలో ఆ కాలం నాటి సంఘర్షణలో ఉన్న బౌద్ధ, వేదవాదాల మధ్యేమార్గం ఉంటుంది. వేద మార్గాన్ని, పూర్వజన్మలను సమర్థించేవాడే అయినా రాజు దైవాంశ సంభూతుడు కాడని, దైవాధీనం జగత్సర్వం కాదని, బుద్ధి బలమే పురుషార్థమని నమ్మినవాడు. రాజనీతి లోక కల్యాణం కోసమని పాలనలో లౌకికత, మానవీయ పాలన కావాలని కోరుకున్నవాడు. ఇతనికి కౌటిల్యుడన్న పేరు కూడా ఉన్నది. అంటే కుటిల రాజకీయాలు నడిపేవాడని. ఇది చాణక్యుడిలోని మరో కోణం. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు నాటి వేదమతంలో మానవీయ సంస్కరణలు కోరుకున్నవాడిగా, లౌకికత్వంతో సర్వమత సామరస్యాన్ని కోరుకున్నవాడిగా చాణక్యుడు మనకు దర్శనమిస్తాడు.
రాజు భోగలాలసుడై తన కర్తవ్యాన్ని మరిచి కాలం గడుపుతుంటే, తన లాంటి మేధావులను కూడా అవమానిస్తుంటే సహించలేదు చాణక్యుడు. నంద సామ్రాజ్యాన్ని కూలగొట్టి దేశీ శూద్రుడైన చంద్రగుప్తుడిని చక్రవర్తిని చేశాడు. ఒక మహా సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ముర అనే దాసీపుత్రుడిని చక్రవర్తిని చేయడానికి చాణక్యుడు పన్నిన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, రాజనీతి చాలాగొప్పవి. మౌర్య రాజ్యస్థాపన అనేది భారత రాజకీయాల్లో గొప్ప ఉప లబ్ధి. దేశాన్ని అఖండంగా ఉంచిన మౌర్య సామ్రాజ్యం, అశోకుడు లాంటి ధర్మచక్ర ప్రభువునందించిన మౌర్యవంశం చాణక్యుడి రాజనీతిజ్ఞత నుంచి వచ్చినవే.
కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు, పథక రచనలు, ఎదుటివారిని చిత్తు జేయగల పన్నాగాలు, అందరినీ మెప్పించగల పథకాలు, మత సామరస్య లౌకిక చర్యలు అతడిని అజేయుడిగా, ఈ కాలపు చాణక్యుడిగా నిలబెడుతున్నాయి. ఆ చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య రాజ్యస్థాపన చేస్తే ఈ చాణక్యుడు వలస పాలకులను ఓడించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేశాడు. రాజుల కాలం కాబట్టి ఆ చాణక్యుడు చంద్రగుప్తుడిని వాహికగా చేసుకొని యుద్ధం ద్వారా నంద రాజ్యాన్ని కూల్చాడు. ప్రజాస్వామిక కాలం కాబట్టి కేసీఆర్ శాంతియుత, గాంధేయ, అహింసా మార్గంలో తిరుగులేని పోరాటం చేశాడు. ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా తెలంగాణ సాధించి ప్రజాభిమానంతో ఓట్లు పొంది గెలిచాడు. మౌర్య రాజ్యస్థాపన కోసం చాణక్యుడు ఎన్ని ఎత్తులు వేశాడో తెలంగాణ సాధన కోసం కూడా కేసీఆర్ అన్నిరకాల ఎత్తుగడలు వేశాడు.
చంద్రగుప్తుడు రాజు కాగానే అయిపోలేదు. ఎన్నో తిరుగుబాట్లు తలెత్తాయి. అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటిని చక్కదిద్దాడానికి చాణక్యుడు తానే మంత్రియై చక్రవర్తికి కుడిభుజంగా నిలిచాడు. అనేక సలహాలిచ్చాడు. రాజు, రాజనీతి ఎలా ఉంటుందో చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే కేసీఆర్ తన కర్తవ్యం ముగిసిందని ఊరుకోలేదు.
ముఖ్యమంత్రిగా వలసవాదులు, ప్రతిపక్షాల నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. వలస పాలకుల నోళ్లు మూయించి తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలన్నీ రావడానికి నిర్విరామ కృషి చేస్తున్నాడు. తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. దండుగన్న వ్యవసాయాన్ని పండుగను చేయడం, రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల ఆదాయ మార్గాలు పెంచడం లాంటి అనేక పనులను అనతికాలంలోనే పూర్తిచేసి ముందుకెళ్తున్నాడు. సబ్బండ వర్ణాలకు ఇంగ్లీషు మాధ్యమ చదువులను గురుకుల విద్యాలయాల ద్వారా అందిస్తున్నారు.
2014 నుంచి జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ లభించిన విజయాలు వర్తమానంలోనే కాదు సుదూర భవిష్యత్తులోనూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని చాటుతున్నాయి. ఈ విషయాన్ని అనేక సర్వేలు ధృవీకరించాయి. కానీ కుటిల నీతితో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని దుష్ట శక్తులు విఫల ప్రయత్నం చేస్తున్నాయి.
కేసీఆర్ చాణక్య రాజనీతి చర్యలకు చక్కటి ఉదాహరణ-ఆయన రాజకీయ వ్యూహాల మూలంగా ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం. ఇది వట్టి మాటలతో, శుష్క వాగ్దానాలతో సాధ్యమయ్యేది కాదు. 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ, మునిసిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించడం కేసీఆర్ చాణక్య ఎత్తుగడలు, వ్యూహాల ఫలితమే. వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్షాలు మొత్తుకున్నా, ఓటమి తప్పదని కూతలు కూసినా 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించడం కేసీఆర్కే సాధ్యం. ఈ విజయాలకు చాణక్యనీతి రాజకీయాలు, ప్రజాహిత చర్యలే కారణం.
2020 మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు విజయం లభించడానికి కారణం, కేసీఆర్ పాలనా ఫలాలు ప్రజలకు అందడమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ల్లోనూ చాణక్య నీతి ప్రదర్శించారు. తన సత్పరిపాలన గురించి ప్రజల ముందు పెట్టి ప్రత్యర్థుల కౌటిల్యాన్ని జయించాడు. మాజీ ప్రధాని, మేధావి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన చాణక్యుడు పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవిని, ప్రముఖ విద్యావేత్త, ఉత్తముడు పల్లా రాజేశ్వరరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించడంతోనే కేసీఆర్ చాణక్యం బయటపడింది. వేతన సవరణ, ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన హామీలనిచ్చాడు.
తాను అన్ని మతాలను గౌరవిస్తానని, తనకు మనిషే ప్రధానమని గ్రామీణులు, రైతులు, సామాన్యులనే కాదు. మేధావులనూ ఒప్పించగలిగాడు. తమ సమస్యలను మాత్రమే కాదు, తెలంగాణ సమస్యలను తీర్చే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విద్యావంతులు భావించారు. అందుకే రెండుచోట్లా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చాణక్యం ముందు జాతీయ పార్టీల రెచ్చగొట్టడాలు పేకమేడల్లా కూలిపోయాయి. విష్ణుగుప్త చాణక్యనీతితో మౌర్య సామ్రాజ్యం అజేయంగా ఉన్న ట్టే, తెలంగాణ చాణక్యుడు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ ప్రజలు, మేధావులు భావిస్తున్నారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఏదేమైనా చాణక్యం గెలిచింది, గెలుస్తుంది. కౌటి ల్యం ఓడటం సహజమే.