న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మార్చిలో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల దేశంలో ఆరు నెలలపాటు విద్యుత్ వినియోగం తగ్గింది. గత ఏడాది ఆగస్ట్ నుంచి విద్యుత్ వినియోగంలో పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తి 23.3 శాతానికి పెరిగింది.
ఫెడరల్ గ్రిడ్ ఆపరేటర్ నుంచి రోజువారీ లోడ్ పంపిణీ డేటా మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఈ మేరకు విశ్లేషించింది. మొత్తం మీద 2019-20 కంటే 2020-21లో విద్యుత్ ఉత్పత్తి 0.2 శాతం తగ్గిందని పేర్కొంది. గత ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో విద్యుత్ ఉత్పత్తి సగటు కంటే 6 శాతం ఎక్కువని తెలిపింది. గత ఆరు నెలలుగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతోపాటు ఉత్తర భారతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఏసీల వినియోగం పెరుగడం కూడా దీనికి కారణమని విశ్లేషించింది.