మన్సూరాబాద్ : పెండ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం తేవాలంటూ అత్తారింటివారు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. కరీంనగర్, భగత్నగర్కు చెందిన గుంజి శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు తేజస్విని(22) వివాహం ఎల్బీనగర్ రాక్టౌన్కాలనీకి చెందిన బత్తుల ఏడుకొండలు, సుశీల దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు(30)తో ఈ సంవత్సరం జనవరి 8న జరిగింది. నగరంలోని క్లేవ్టెక్ సంస్థలో వెంకటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తేజస్విని బీబీఐటీ కాలేజ్లో ఎంబీఏ చదువుతుంది. వివాహ సమయం లో సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, కట్నం అందజేశారు. వివాహం జరిగిన 20 రోజుల నుంచే తేజస్వినికి వేధింపులు ప్రారంభమయ్యాయి.
అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామ, ఆడపడుచు యామిని ప్రతిరోజు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయసాగారు. వెంకటేశ్వరరావుకు శారీరక సమస్యలు ఉన్న విషయాన్ని దాచి.. మోసం చేసి పెండ్లి చేసినట్లు ఆమె ఆరోపించింది. తనను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్ద ఉంచుతున్నారని తెలిపింది. వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని మంగళవారం నాగోల్ డివిజన్ రాక్టౌన్కాలనీలోని భర్త ఇంటి ముందు తేజస్విని.. కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. అత్తారింటి వేధింపులపై ఈనెల 24న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసును సరూర్నగర్ మహిళా పోలీస్స్టేషన్కు బదలాయించారని తేజస్విని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారన్నారు. కానీ.. ఇంత వరకు అత్తారింటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ధర్నా కు దిగామని.. తమకు న్యాయం చేయాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోరారు.