ఆస్తిపన్ను చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల నిర్ధేశిత టార్గెట్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు రూ.1559.38కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19, వందేండ్ల తర్వాత రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, వరుసగా జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ 82శాతం మేర వసూళ్లను రాబట్టడం గమనార్హం. కాగా చివరి రోజు ఆస్తిపన్ను చెల్లింపు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లించడానికి వీలుగా బుధవారం (నేడు) జీహెచ్ఎంసీలోని అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆస్తిపన్ను చెల్లించడానికి ఈ నెల 31తో గడువు ముగుస్తుందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆస్తిపన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఆస్తిపన్ను చెల్లించడానికిగాను సిటిజన్ సర్వీస్ సెంటర్లన్నీ రాత్రి12 గంటల వరకు పనిచేస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా తమ ఆస్తిపన్నును చెల్లించవచ్చని చెప్పారు.