ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్ఘన్పూర్టౌన్, మార్చి 30 : నెల రోజుల్లోగా స్టేషన్ఘన్ఫూర్ పాత బస్టాండ్ నుంచి శివునిపల్లి రైల్వేగేటు వరకు ప్రధాన రోడ్డుపై బీటీ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులను మంగళవారం ఆర్అండ్బీ, ఎన్పీడీసీఎల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జీపీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజయ్య మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న స్టేషన్ఘన్పూర్లో పాత బస్టాండ్ నుంచి రైల్వేగేటు వరకు రోడ్డు ఇరుకుగా ఉన్నందున విస్తరణ పనులు చేపట్టామన్నారు.
రోడ్డుకు ఇరువైపులా 37 ఫీట్ల వరకు నిర్మాణాలుంటే తొలగించినా ప్రజలను కోరామని, ఇందుకనుగుణంగా అందరూ సహకరించారని రాజయ్య చెప్పారు. ఈ నేపథ్యంలో ‘మిషన్ భగీరథ’లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్, ఎంపీడీవో కుమారస్వామి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్ దయాకర్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, ఈవో పున్నం శ్రీనివాస్ పాల్గొన్నారు.