సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 30 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల భర్తీకి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కలెక్టర్ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. అందుకోసం ముందుగా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ 3న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ముద్రించాలని, 6న జిల్లా స్థాయి, 7న మండల స్థాయిలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. 4 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 10న అభ్యంతరాలను పరిశీలించి డిస్పోజ్ చేయాలని, 12న ఓటర్ల తుది జాబితా ముద్రించి, సంబంధిత ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో జాబితాను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 8 సర్పంచ్, 52 వార్డు మెంబర్ల స్థానాలు ఖాళీలు..
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 8 సర్పంచ్, 52 వార్డు మెంబర్ల స్థానాలకు ఖాళీలు ఉన్నాయని ఎన్నికల కమిషనర్కు వివరించారు. అదేవిధంగా ఒక ఎంపీటీసీ పదవి ఖాళీ ఉందన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
నా బడి కోసం” మొబైల్ యాప్ ఆవిష్కరణ
ఎకో టూరిజం అభివృద్ధిపై మంత్రుల సమీక్ష