న్యూఢిల్లీ : కొవిడ్-19 నియంత్రణకు భారత్లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వాట్సాప్ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్వసించరాదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకినా అది తీవ్రతరమై దవాఖానలో చేరే పరిస్థితిని వ్యాక్సిన్ నివారిస్తుందని పేర్కొన్నారు. భారత్లో ప్రజలకు అందిస్తున్న కోవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ సురక్షితమైనవని అన్నారు.
వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత తమ మంత్రిత్వ శాఖ అధికారులు ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని చెప్పారు. ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్లో భార్య నూతన్ గోయల్తో కలిసి వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ తర్వాత కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఆరు కోట్లకు పైగా కొవిడ్ డోసులను ప్రజలకు అందించారు.