మున్ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసిన రాష్ట్ర సర్కార్
వికారాబాద్ జిల్లాలో వానకాలం సాగు అంచనా 5,84,157 ఎకరాలు
రైతు బంధు ప్రకారం జిల్లాలో 2,25,215 మంది అన్నదాతలు
ఏప్రిల్ నుంచే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి..
ఇప్పటి నుంచే దుక్కులు దున్నుకుంటున్న కొందరు రైతులు
వికారాబాద్, మార్చి 28, (నమస్తే తెలంగాణ) : రైతుల బాగు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు విషయంలోనూ ముందుగానే అప్రమత్తమైంది. అదునుకు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందన్న ఉద్దేశంతో సాగు అంచనా ప్రణాళికను మున్ముందుగానే సిద్ధం చేసింది. వికారాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,84,157 ఎకరాలు కాగా, అందుకు సరిపడా ఎరువులు, విత్తనాలను ఏప్రిల్లోనే అందుబాటులో ఉంచనున్నది. రైతుబంధు పథకం ప్రకారం జిల్లాలో 2,25,215 మంది రైతులు ఉన్నారు. యాసంగి సీజన్లో తడి, ఆరుతడి పంటలు కొంతమేర చేతికొచ్చినా, ఇంకా కొన్ని పంటలు చేతికిరావాల్సి ఉన్నది. ఎండాకాలంలో పొలాన్ని చదును చేసుకుని ఎండగడితే సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పంటచేతికొచ్చిన రైతులతోపాటు ఆరుతడి పంటలు సాగు చేసే రైతులూ దుక్కులు దున్నే పనుల్లో బిజీగా గడుపుతున్నారు.
వచ్చే వానకాలం పంటల సాగు ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో పత్తి 2,39,605, మక్కజొన్న 52,608, జొన్న 10,180, కంది 1,72,533, వరి 69,927, మినుములు 9977, పెసర 18,807, సోయాబిన్ 2476, నువ్వులు 313, వేరుశనగ 552, ఆముదం 224, చెరుకు 3714, బొబ్బర్లు 1438, చిరుధాన్యాలు 952, పొద్దు తిరుగుడు 25, ఇతర పంటల సాగు 826 చొప్పున మొత్తం 5,84,157 ఎకరాలు సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం సాగులోకి 10శాతం అదనంగా వస్తుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, వరి, మినుములు, పెసర, సోయాబిన్, నువ్వులు, వేరుశనగ, ఆముదం, చెరుకు, చిరుధాన్యాలు, పొద్దు తిరుగుడు తదితర వానకాలం పంటలను అధికారులు తమ నివేదికలో పొందుపర్చారు. జిల్లాలో రైతుబంధు ప్రకారం 2,25, 215 మంది రైతులు ఉన్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం..
జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), అగ్రో రైతు సేవా సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ షాపుల ద్వారా విత్తనాలను రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే విత్తనాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఏర్పాటు చేసి జూలై వరకు అమ్మకాలు చేయనున్నారు. గతేడాది పచ్చి రొట్ట ఎరువులను ప్రభుత్వం 60శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. ఈ సంవత్సరం ఇంకా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. రైతులు సాగు చేసిన అనంతరం పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాత విత్తనాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలను ధ్రువీకరించుకున్న తర్వాత తీసుకున్న విత్తనాన్ని శుద్ధి చేసి సీడ్ సర్టిఫికేషన్ చేయనున్నారు. కొడంగల్ డివిజన్లో 1,29,742, పరిగి డివిజన్లో 1,26,240, తాండూరు డివిజన్లో 1,41,866, వికారాబాద్ డివిజన్లో 1,86,309ల చొప్పున సాగులోకి రానుందని అధికారులు అంచనాలు వేశారు.
దుక్కులు దున్ని ..
రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. విత్తనాలు సకాలంలో వ్యవసాయాధికారులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండల కేంద్రాలతో పాటుగా గ్రామాల్లోని ఆయా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రైతు వేదిక క్లస్టర్ల వారీగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు పొలం దున్నే పనులు జోరుగా చేపట్టారు.
ఇవి కూడా చదవండి
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!