గజ్వేల్ అర్బన్, మార్చి 27 : మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి భవనాలను నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ అన్నారు. పట్టణంలోని 18వ వార్డులో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. దీంతో మున్సిపాలిటీ నుంచి సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసినా.. నిర్మాణాన్ని ఆపకుండా కొనసాగించడంతో శనివారం మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సిబ్బందితో కలిసి జేసీబీతో నిర్మాణాలను కూల్చివేయించారు. అదేవిధంగా రోడ్డును ఆక్రమించి నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన ఇంకొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ మాట్లాడారు. మున్సిపల్ చట్ట ప్రకారం ఇంటి నిర్మాణానికి తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, అదనంగా నిర్మాణాలు చేస్తే చట్టప్రకారం నోటీసులు ఇవ్వడంతో పాటు భవనాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. కూల్చిన నిర్మాణాలపై చర్యల గురించి సంబంధిత వివరాలు కలెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులకు సమర్పించినట్లు తెలిపారు. తప్పుడు సమాచారంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా పి.రవీందర్రెడ్డి, కల్పన నిర్మాణ పనులు ప్రారంభించడానికి సహకరించిన వినయ్కుమార్ ఎల్టీపీ లైసెన్స్ రద్దు చేసి బ్లాక్లిస్ట్లో ఉంచినట్లు తెలిపారు.
పట్టణంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన..
పట్టణంలోని బాలాగౌడ్నగర్, మారుతినగర్ కాలనీల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ రమణాచారి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులల్లో వీధిదీపాలు వేయించాలని ఏఈని ఆదేశించారు. యూజీడీ పైపులైన్ నుంచి నీరు బయటకు వస్తుందని 24గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సీసీరోడ్ల పనులను పరిశీలించారు. మురికి కాల్వపై కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఏఈని ఆదేశించారు. అనంతరం బుస్సాపూర్లో వేబ్రిడ్జి వద్ద సీసీరోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు, వర్మీకంపోస్టు షెడ్ నిర్మాణం, స్వచ్ఛపార్కు, నర్సరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏఈ, కాంట్రాక్టర్ను ఆదేశించారు. స్వచ్ఛబడిలో గోడలు అందంగా కనిపించేలా ఆర్ట్ వర్క్ పనులను పూర్తి చేయాలన్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ నర్సయ్య, ఏఈలు మహేశ్, రంజిత్, అన్వేశ్రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి ఐలయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు సతీశ్, బాల ఎల్లం ఉన్నారు.