ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు హైవేలకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సిద్దిపేట మీదుగా జాతీయ రహదారి
మెదక్-ఎల్కతుర్తి రహదారికి ఎన్హెచ్ 765డీజీ నంబర్ కేటాయింపు
మెదక్-ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్ల నిర్మాణం
మెదక్ టూ భైంసా హైవేకు పచ్చజెండా
ఫలించిన సీఎం కేసీఆర్ చొరవ
మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషి
గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట జోన్ / మెదక్, మార్చి 26 : ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు రహదారులను జాతీయ రహదారు (హైవే)లుగా గుర్తిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు 133 కిలోమీటర్లు నిర్మించే రహదారికి జాతీయ రహదారి-765డీజీని కేటాయిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రహదారి వరంగల్ నగరం, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయంపేట, మెదక్ పట్టణాలను అనుసంధానం చేయనున్నది. దీంతో వరంగల్ నుంచి మెదక్ ప్రయాణం సులభతరం కానున్నది. ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్కు వెళ్లకుండా ఢిల్లీ, నాగ్పూర్ నుంచి వచ్చే వాహనాలు వరంగల్ వెళ్లడానికి వీలవుతుంది. మెదక్ పట్టణం నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాసర, బోధన్, బైంసా వరకు 168 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారి నిర్మించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. తద్వారా ఉమ్మడి జిల్లా మరింతగా అభివృద్ధి చెందనున్నది. ప్రధానంగా మెదక్, సిద్దిపేట జిల్లాకేంద్రాలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయి. రోడ్ కనెక్టివిటీ పెరిగి ప్రయాణం సౌకర్యంగా మారనున్నది.
సిద్దిపేట వాసుల ఎన్నో ఏండ్ల కల..
సిద్దిపేట ప్రాంతానికి జాతీయ రహదారి రావాలని ఎన్నో ఏండ్ల నుంచి అడుగుతున్నా, సమైక్యాంధ్రలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రధానిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు కేంద్ర మంత్రులకు లేఖలు రాయడంతోనే ఇది సాధ్యమైంది. సిద్దిపేట ప్రాంతానికి జాతీయ రహదారి ఏర్పాటుతో అన్ని విధాలుగా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సిద్దిపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్ట్రియల్ హబ్ ముందు నుంచే జాతీయ రహదారి వెళ్లనుండడంతో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ చొరవ.. మంత్రి, ఎంపీ కృషి..
సిద్దిపేట ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చొరవతో పాటు మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఉంది. వీరు కేంద్రమంత్రులు, అధికారులను కలువడం, సమీక్షలు నిర్వహించడం, మంత్రి హరీశ్రావు జాతీయ రహదారుల ఇంజినీర్లతో పలుమార్లు సమీక్షలు జరిపారు. జాతీయ రహదారి ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజలకు కలిగే లాభాలు, సౌకర్యాలు, వాణిజ్య పరంగా జరిగే అభివృద్ధిని పలుసార్లు చర్చించి జాతీయ రహదారి ఆవశ్యకతను కేంద్ర అధికారులకు వివరించారు. తాజాగా ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు 133 కిలోమీటర్ల జాతీయ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించడంతో వీరి కృషి ఫలించింది.
మెదక్ జిల్లా అభివృద్ధికి దోహదం..
మెదక్ జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట, సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి జంక్షన్ వరకు నిర్మించే 133కిలో మీటర్ల జాతీయ రహదారితో మెదక్ జిల్లా అభివృద్ధిలో పరుగులు తీయనున్నది. మెదక్ నుంచి వరంగల్ వరకు రోడ్డువిస్తరణ జరుగడంతో పాటు రోడ్ కనెక్టివిటీ పెరిగి ప్రయాణం సౌకర్యంగా మారనున్నది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలూ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బాలానగర్ టూ బోధన్ వరకు హైవే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మెదక్ వరకు ఈ హైవే పనులు పూర్తవగా, మెదక్ పట్టణంలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలా మెదక్ చుట్టూ రోడ్లు, హైవేల కనెక్టివిటీ పెరుగుతుండడంతో మరింత అభివృద్ధి జరుగనున్నది. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాసర, బోధన్, బైంసా వరకు 168 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారి నిర్మించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. తద్వారా ఉమ్మడి జిల్లా మరింతగా అభివృద్ధి చెందనున్నది.