నిర్లక్ష్య డ్రైవింగ్పై 304 పార్ట్- 2 కేసు
సైబరాబాద్ పరిధిలో కఠినంగా అమలు
గత ఏడాది 75 మందికి జైలుశిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రాణాలు తీస్తే డ్రైవర్తోపాటు తోటివారికీ ఈ సెక్షన్ వర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతలో భాగంగా వాహనదారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే క్రమంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. ముఖ్యంగా మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి మరణానికి కారకులైనవారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. నిర్లక్ష్యానికి ఖరీదుగా పదేండ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా చేయడంతో సైబరాబాద్లో గత ఏడాది 37 కేసులను 304 పార్ట్-2 కింద నమోదు చేసి 48 మంది నిందితులను గుర్తించి 45 మందిని అరెస్టుచేశారు. ఈ ఏడాదిలో మార్చి 24 వరకు 25 కేసులు నమోదుచేసి 30 మందిని అరెస్టుచేశారు. ఇందులో మద్యం తాగి వాహనాలు నడిపించి ఇతరుల ప్రాణాలను తీసినవారు కూడా ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసినా వారికి వాహనాలు ఇచ్చి రోడ్డు ప్రమాదంలో మరణానికి కారకులైనవారితోపాటు వాహన యజమానులను సైతం జైలుకు పంపారు. ఇందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. చాలా కేసుల్లో సీసీ కెమెరాలే కీలకాధారాలను అందిస్తున్నాయి. బుకాయించేందుకు ప్రయత్నించినా కాల్ లొకేషన్ వివరాలను కూడా దర్యాప్తులో సేకరిస్తున్నారు.
304 పార్ట్ 2 అంటే..
తన చర్య వల్ల ప్రమాదం చోటుచేసుకొని ప్రాణాలు పోతాయని తెలుసు.. కానీ చంపాలనే ఉద్దేశం ఉండదు. తెలిసి కూడా అలా వ్యవహరించడంతో జరిగే ప్రమాదంలో మరణం సంభవిస్తే ఆ కారకుడిపై 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదుచేస్తారు. కోర్టు విచారణలో ఈ అభియోగానికి నేరం నిర్ధారణ అయితే 10 ఏండ్లు జైలు శిక్ష పడుతుంది. డ్రంకన్ అండ్ డ్రైవ్లో కూడా.. వాహనం నడిపే వ్యక్తి మద్యం తాగాడని తెలిసినా అతడితో కలిసి ప్రయాణించినా వాహనంతోపాటు కారులో ఉండే మిగతా వారిపై కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. మద్యం తాగకున్నా రాంగ్ రూటులో వచ్చినా, మితిమీరి వేగంతో నడిపినప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాల్లోనూ ఈ సెక్షన్ వర్తిస్తుందని పోలీసు లు స్పష్టంచేస్తున్నారు. ఈ సెక్షన్లు అమలవుతున్నప్పటి నుంచి డ్రంకన్ డ్రైవింగ్తో జరిగే ప్రమాదాలు కొంతమేర తగ్గాయని పోలీసు లెక్కలు చెప్పుతున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలు పాటించకపోతే చట్టంలో చాలా కఠిన శిక్షలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ఒకరి ప్రాణం తీయడం దుదృష్టకరం.
-ఎస్ఎం విజయ్కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్