మహమ్మారిపై పోరు మొదలైంది ఆరోజే
కేంద్ర, రాష్ర్టాల పిలుపుతో స్వచ్ఛంద బంద్
14 గంటలపాటు అంతా గప్చుప్
ఎక్కడి ప్రజలు అక్కడే.. హోటళ్లు, దుకాణాలు అన్నీ మూతే
ప్రధాన ప్రాంతాలు, రోడ్లు వెలవెల
స్వచ్ఛంద కట్టడితో మహమ్మారిపై మూకుమ్మడి దాడి
ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్లోనూ అదే చైతన్యం
చెదరని జ్ఞాపకంలా గడియలు
కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): అది 2020 మార్చి 22. కొవిడ్-19 అలజడి రేపుతున్న కాలమది. అప్పటిదాక ఎంతో రద్దీగా ఉండే కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా నిర్మానుష్యమైంది. పోలీసు పహారా లేదు, సైరన్ మోతల్లేవు, ఎక్కడి జనం అక్కడే.. అంతా నిశ్శబ్ద వాతావరణమే కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు దేశం మొత్తం షట్డౌన్ అయింది. కరోనా కట్టడికి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో జనతా కర్ఫ్యూను ప్రజానీకం విజయవంతం చేసింది. ఎక్కడివారక్కడ ఇండ్లకే పరిమితమై ఐక్యతను చాటి, మహమ్మారిపై నిశ్శబ్ద పోరును ప్రకటించింది.14 గంటలపాటు అడుగు బయటపెట్టకుండా స్వచ్ఛందంగా బంద్ పాటించడమేకాదు ఆ మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్లోనూ ఇదే చైతన్యాన్ని చూపింది. ఆ మరుపురాని రోజుకు నేటితో ఏడాది పూర్తయినా ఇంకా కండ్లముందే కదలాడుతున్నది.
ప్రపంచాన్ని వణికిస్తూ.. అప్పుడ ప్పుడే దేశంలో ప్రవేశించిన కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో జనతా కర్ఫ్యూ నిర్వహించి నేటికి సరిగ్గా ఏడాది అవుతున్నది. సబ్బండవర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించి, కరోనాపై నిశ్శబ్ద పోరుకు వేదికైన ఆ రోజు ఇప్పటికీ ప్రజల కండ్ల ముందు కదలాడుతున్నది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరూ స్వీయ కట్టడి చేసుకొని ఇండ్లకే పరిమితమైన ఆ రోజు, ప్రతి ఒక్కరిలో ఎంతో చైతన్యాన్ని తెచ్చింది.
భయం భయంగా ఉమ్మడి జిల్లా..
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో గతేడాది మార్చి 22న జరిగిన జనతా కర్ఫ్యూలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అంతకు ఐదు రోజుల ముందే (మార్చి 16న) జిల్లాలో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులకు పాజిటివ్ రావడం కలకలం రేపింది. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా 8 కేసులు బయట పడ్డాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు విదేశాల నుంచి అనేక మంది వస్తున్నారు. ఎవరిలో ఎలాంటి మాయరోగం ఉందో తెలియని భయంతో జిల్లా ప్రజలు గడిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుతో మార్చి 22న ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. పోలీసు, వైద్య, అగ్నిమాపక సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనం ఇండ్ల నుంచి బయటికి కదల్లేదు. సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఇండ్ల ముందుకు వచ్చి కరోనా వారియర్స్గా సేవలందిస్తున్న వైద్యులకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
స్వచ్ఛందంగా బంద్
ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కనీసం ఆటోలు కూడా నడువలేదు. రహదారు లు నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జనతా కర్ఫ్యూ గురించి ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ముందు రోజే అవసరమైన నిత్యావసరాలు సమకూర్చుకున్న జనం ఒక్క క్షణం కూడా బయటికి రాలేదు. నిత్యం రద్దీగా ఉండే ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ సహా జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారా యి. పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షించడం మినహా పహారా కాయాల్సిన అవసరం లేకుండా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరిగింది.
మరుసటి రోజు నుంచే లాక్ డౌన్..
జనతా కర్ఫ్యూ విజయవంతమైన మరుసటి రోజు(మార్చి 23) నుంచే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. మొదట అదే నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగింది. మే 5 తర్వాత కొన్ని ఆంక్షలు సడలించి అదే నెల 29 వరకు అంటే దాదాపు 45 రోజుల పాటు అమల్లో ఉన్న లాక్ డౌన్ జిల్లాలో అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చిం ది. ఇండ్ల నుంచి బయటి రాకుండా పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖల విధులు కూడా స్తంభించి పోయాయి. మహమ్మారి నుంచి క్రమంగా కోలుకున్న జిల్లా ప్రజలు ఇప్పటికీ వ్యక్తిగత భద్రతతోనే బయట తిరుగుతున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ధైర్యాన్నిచ్చింది..
కరోనాను తరిమికొట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూను మా ఇంటిల్లిపాది స్వచ్ఛందంగా పాటించాం. ఆ రోజు మొత్తం అడుగు బయటపెట్టలేదు. నాకు ఇంకా గుర్తుంది. మా ఊరంతా నిర్మానుష్యంగా మారింది. మొత్తానికి మాకు జనతా కర్ఫ్యూ నేర్పిన పాఠం, ప్రభుత్వాలు ఇచ్చిన ధైర్యంతో కరోనాను ఎలా ఎదుర్కొవాలో తెలిసిపోయింది. అప్పుడున్న పరిస్థితులతో కర్ఫ్యూను విధించడం సమంజసమే. లేదంటే వ్యాధి మరింతగా ప్రబలి దేశంలో, రాష్ట్రంలో మరణాల సంఖ్య రెట్టింపయ్యేది. కొంత ఇబ్బందైనా ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్నూ పాటించాం.
కొవిడ్ను నియంత్రించాం..
కరోనాతో గతేడాది కాలంగా కుంటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేశాం. ఇండోనేషియా దేశస్తుల వల్లే జిల్లాలో కరోనా పెరిగింది. జనతా కర్ఫ్యూ .. ఆ తర్వాత లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడంతో కొంత అదుపులోకి వచ్చింది. మేమంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉన్నాం. ఆశ కార్యకర్తల నుంచి తన వరకు 24 గంటలు పని చేసి, బాధితులకు చికిత్స అందించాం. వైదద్యారోగ్యశాఖ ఉద్యోగులమంతా ఒక కుటుంబంలాగ ఉండి, పని చేయడంతోనే కొవిడ్ను నియంత్రించాం. – జీ సుజాత, డీఎంహెచ్వో, కరీంనగర్