రేపు ఉదయం మంత్రి చేతుల మీదుగానీటి విడుదల
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
గజ్వేల్ రూరల్,మార్చి 21: రైతులు సాగుచేసిన వరి పంటలు ఎండిపోతుండడంతో కూడవెల్లి వాగుకు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతున్నది. ఆదివారం మండల పరిధిలోని కొడకండ్ల వద్ద కాలువను పరిశీలించిన అనంతరం రైతుల సమస్యను ఫోన్ ద్వారా రాష్ట్ర మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్కు తెలియజేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కొడకండ్ల జంక్షన్ వద్ద నుంచి నీటిని కూడవెల్లి వాగులోకి వదిలితే, గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి, సింగా టం, అహ్మదీపూర్, కొల్గూర్ గ్రామాలతో కలిపి తొగుట, దుబ్బాక మండలాల్లోని రైతులు సాగు చేసిన 11వేల ఎకరాల వరికి మేలు జరుగుతుందని సీఎంకు మంత్రి చెప్పారు. దీంతో వెంటనే నీటిని వదలాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నీటి విడుదలతో 36 చెక్డ్యాంలు నిండడంతో పాటు వాగు పక్కన సాగుచేసిన వరి పంటలు చేతికి వస్తాయి. సమస్యను వివరించిన క్షణాల్లోనే పరిష్కార మార్గం చూపించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎస్ఈ వేణు, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, దేవి రవీందర్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం, మండలాధ్యక్షుడు మధు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి, ఎంపీటీసీ అశోక్, నాయకులు పాల్గొన్నారు.
సీఎం ఆదేశాలతో ముమ్మరంగా కాల్వ పనులు
గజ్వేల్అర్బన్, మార్చి 21: సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలు తరలించడానికి కనెక్టింగ్ కాలువ పనులు ము మ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం పంటసాగు కోసం నీరు కావాలని రైతులు మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్కు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేయగానే వెంటనే స్పందించి నీటి విడుదలకు ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే అధికారులను, ప్రజాప్రతినిధులను కొండపోచమ్మ కాలువ, కూడవెళ్లి వాగు మధ్య కనెక్టింగ్ కాలువను తవ్వాలని మంత్రి ఆదేశించి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎస్ఈ వేణు, ఈఈ నారాయణలతో పాటు సిబ్బంది కాలువ తవ్వకం పనుల్లో నిమగ్నమయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్ కాలువ పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులు సోమవారం మధ్యాహ్నం వరకూ కొనసాగుతుండడంతో మంగళవారం ఉదయం కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. అలాగే కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ కాలువ ద్వారా కూడా మరో మూడు నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.