న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికిత్స కోసం స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్వదేశానికి బయలుదేరనున్నట్లు వెల్లడించింది. మార్చి 23 నుంచి పుణె వేదికగా తొలి వన్డే మొదలవనుంది.
జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మొదటి భాగంలోని మ్యాచ్లకు దూరంకానున్నాడని ఇంగ్లాండ్ బోర్డు పేర్కొంది. ఆర్చర్ దూరమవడం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి పెద్ద దెబ్బ. భారత్తో ఐదు టీ20ల సిరీస్లో పాల్గొన్న ఆర్చర్ మోచేతి సమస్యలు తీవ్రమయ్యాయి. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఈసీబీ వెల్లడించింది.
వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథన్ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, మాట్ పార్కిన్సన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, టాప్లే, మార్క్వుడ్