హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ భవితవ్యాన్ని తేల్చినట్టు కనిపిస్తున్నది. టీఆర్ఎస్, ఉద్యమసారథి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఇక కాలగర్భంలో కలిసిపోకతప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంతో ఆర్భాటంగా 2017లో ప్రారంభమైన టీజేఎస్ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపడ్తామని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం రాష్ట్రవ్యాప్తంగా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విమర్శిస్తూ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన మరికొన్ని పార్టీలతో పొత్తు కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ ఎక్కడా ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అయినప్పటికీ 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి భంగపడింది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీని అదృష్టం వరించలేదు.
దీంతో ఆ పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు కూడా రద్దయింది. కోదండరాం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలతో ఒకవర్గం బయటకు వెళ్లిపోయింది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు కూడా కోదండరాం పట్ల నమ్మకం ఉంచలేదు. దీంతో టీజేఎస్ ఇక అంతర్థానమైనట్టేనని ఆ పార్టీలోని కీలక నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. విన్నర్ కాలేదు సరికదా.. కనీసం రన్నర్గా కూడా నిలువలేకపోయామని, పైగా ప్రతీ రోజు అధికారపార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మీడియాలో అల్లరి చేయడానికే తమ సమయమంతా పోయిందని, అంతా అనాలోచిత, అర్థరహిత వాదనలతో తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకున్నట్టయ్యిందని, చివరకు ఘెర పరాభవాన్ని మూటకట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.