ఖైరతాబాద్, మార్చి 18: గుండె లయను క్రమబద్ధీకరించే పేస్మేకర్ శిథిలమైంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకి ఎడమ వైపు ఛాతి భాగంలో చీము కారుతూ ప్రమాదకరంగా మారింది. ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్న రోగికి వైద్యులు ప్రాణం పోశారు. ప్రముఖ హృద్రోగ నిఫుణులు డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ రోగికి కొత్త జీవితాన్ని అందించారు. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స విశేషాలను నిమ్స్ కార్డియాలజీ విభాగ అధిపతి డా॥ సాయి సతీశ్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన మహేందర్ (32)కు 2010లో గుండెజబ్బు వచ్చింది. ఫలితంగా గుండె లయ నెమ్మదించి ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, పేస్మేకర్ అమర్చారు. సుమారు 11 సంవత్సరాల పాటు దానితోనే నెట్టుకొచ్చాడు. నెల రోజుల క్రితం పేస్మేకర్ అమర్చిన ప్రదేశం నుంచి చీము, నెత్తురు కారడం ప్రారంభమైంది. దీంతో భయబ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లగా, వారు చికిత్స అందించేందుకు నిరాకరించారు. దీంతో నిమ్స్ దవాఖానాకు తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు చికిత్స క్లిష్టమైనా.. రోగి ప్రాణాలను రక్షించాలన్న సంకల్పంతో పది రోజుల క్రితం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.
ఎలక్ట్రానిక్ పరికరమైన ఒక పేస్మేకర్లో సర్క్యూట్, తీగల వ్యవస్థ ఉంటుంది. గుండె ధమనులకు అనుసంధానంగా దానిని శస్త్రచికిత్స ద్వారా ఛాతి భాగంలో అమర్చుతారు. రోగి మహేందర్కు తీగలు, పేస్మేకర్ ఉన్న ప్రాంతంలో మొత్తం చీము నిండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. చర్మంలో అతుక్కుపోయిన ఆ యంత్రాన్ని, దానికున్న తీగలను తొలగించాలంటే కత్తి మీద సాము. డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలో వైద్యుల బృందం తొలుత శస్త్రచికిత్స ద్వారా పేస్మేకర్ను విజయవంతంగా తొలగించారు. అనంతరం, గుండె లోపలి భాగంలో ఉన్న తీగలను తొలగించడం సాధ్యం కాలేదు. దీంతో అధునిక పద్ధతిని అవలంభించారు. సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి కాలి నుంచి ఓ సన్నని తీగను కాలులో ఉన్న నరం ద్వారా పంపించి గుండె దమనుల ప్రాంతంలో ఉన్న తీగలను విజయవంతంగా తొలగించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రోగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని డా॥ సాయి సతీశ్ తెలిపారు. ఇలాంటి శస్త్రచికిత్స దేశంలోనే అరుదుగా నిర్వహించారని, నిమ్స్లో తొలిసారిగా నిర్వహించామని, రోగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు.
రోగులకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నిర్వహించే క్రమంలో ఎలాంటి లోహపు వస్తువులు శరీరంపై ఉండరాదు. ఒక వేళ ఉంటే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ప్రస్తుతం, రోగి మహేందర్కు నిమ్స్ వైద్యులు అమర్చిన పేస్మేకర్ అయ స్కాంత రహితంగా ఉంటుంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు సైతం నిర్వహించినా ఎలాంటి ప్రమాదం ఉండదని సాయి సతీశ్ తెలిపారు.